మహబూబ్నగర్ : వైద్య రంగంలో మహబూబ్నగర్ను హైదరాబాద్కు దీటుగా తీర్చిదిద్దుతామని ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావుతో కలిసి మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో జిల్లాకు నూతనంగా మంజూరైన నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించి ఖరారు చేశారు. మెడికల్ కళాశాల పక్కనే 15 ఎకరాలలో నర్సింగ్ కళాశాలను నిర్మిచేందుకు నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాలమూరు జిల్లాకు మెడికల్ కళాశాల రావడంతో అనుబంధంగా నర్సింగ్ కళాశాల, ఇతర సంబంధిత కళాశాలలు రావడం సంతోషకరంగా ఉందన్నారు. నర్సింగ్ కళాశాలతోపాటు మహబూబ్ నగర్ పట్టణంలోని పాత కలెక్టరేట్ భవనం వద్ద 10 ఎకరాలలో నూతన దవాఖానను నిర్మించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు మంత్రి తెలిపారు.
హైదరాబాదులో ఉన్నట్లుగానే మహబూబ్ నగర్లో కూడా వివిధ ప్రాంతాలలో చిన్న పిల్లల దవాఖాన, మాత శిశు సంక్షేమ దవాఖానలతో పాటు ఇతర దవాఖానల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. వైద్య కళాశాలలకు అనుబంధంగా ఉండే విధంగా నర్సింగ్, ఫార్మసీ కళాశాలలకు ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందించాలని ఆయన మెడికల్ కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్ కు సూచించారు.
మహబూబ్ నగర్ జిల్లాకు తెలంగాణ నుంచే కాక కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలనుండి వైద్యం కోసం వచ్చే అవకాశం ఉన్నందున భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని దవాఖానల నిర్మాణానికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
మంత్రి వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.సీతా రామారావు, మెడికల్ కళాశాల డైరెక్టర్ డా. పుట్టా శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ కె.సి.నర్సింహులు, వైస్ చైర్మన్ గణేష్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆలయాల్లో ఆన్లైన్ ఆర్జిత సేవలు
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత
పారిశుధ్య, ఆశా వర్కర్ల కృషి మరువలేనిది
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ నమోదు : మంత్రి నిరంజన్ రెడ్డి
పేదింటి ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి
ప్రజల నమ్మకాన్ని పెంచేలా పాలన అందించాలి