Bandi Sanjay | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నారు? రబీ, ఖరీఫ్లో చెల్లించాల్సిన రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టినందుకా? రుణమాఫీలో కోతపెట్టి రైతులను మోసం చేసినందుకా? పంట నష్టపరిహారం ఇవ్వకుండా అన్నదాతలను గోస పెట్టినందుకా? అని రేవంత్ సర్కార్ను బండి సంజయ్ ప్రశ్నించారు.
రాబోయే ‘స్థానిక సంస్థల’ ఎన్నికల్లో లబ్ది పొందేందుకే ఈ రుణమాఫీ డ్రామా అని బండి సంజయ్ ధ్వజమెత్తారు. రైతు భరోసా పేరుతో రబీ, ఖరీఫ్ సీజన్లో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఎందుకివ్వలేదు? రైతు భరోసా సదస్సుల పేరుతో జాప్యం చేస్తూ రైతులను అరిగోస పెడతారా? ఖరీఫ్, రబీ సీజన్లో రైతులకు చెల్లించాల్సిన ‘రైతు భరోసా’ సొమ్ము రూ.20 వేల కోట్లకుపైనే… రైతు భరోసా సొమ్ము ఎగ్గొట్టి ఆ డబ్బులో కొంత భాగాన్ని రుణమాఫీకి మళ్లించి రైతులకు మేలు చేసినట్లు ఫోజు కొడతారా? ఎన్నికల హామీ మేరకు రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోండి అని కాంగ్రెస్ ప్రభుత్వానికి బండి సంజయ్ సూచించారు.
రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను తప్పింది. గత ఎన్నికల్లో రూ.2 లక్షలోపు రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కొర్రీల మీద కొర్రీలు పెడుతూ కొద్దిమందికే రుణమాఫీ చేయడం దుర్మార్గం. రాష్ట్రవ్యాప్తంగా 39 లక్షల మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తుంటే… వారిలో 11 లక్షల మందికి మాత్రమే రుణమాఫీని వర్తింప జేస్తుండటం అన్యాయం. ఈ లెక్కన నూటికి 70 శాతం మంది రైతులకు రుణమాఫీ వర్తించకపోవడం దారుణం. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి(ఎస్ఎల్బీసీ) లెక్కల ప్రకారం రాష్ట్రంలో రైతులు తీసుకున్న రుణాల మొత్తం రూ.64 వేల కోట్లకుపైమాటే. అందులో 10 వంతు మాత్రమే చెల్లించి సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదం అని బండి సంజయ్ పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామా తప్ప రైతులపట్ల ఆ పార్టీకి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు. మాకు అందుతున్న సమాచారం ప్రకారం రూ.లక్ష లోపు రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య దాదాపు 39 లక్షలు. మిగిలిన వారికి రుణమాఫీ చేయకపోవడానికి కారణాలేమిటో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముందుంచాలి. గత ప్రభుత్వం రైతు బంధు పథకం కింద రెండు విడతల్లో కలిపి గత ఏడాది దాదాపు 70 లక్షల మంది రైతులకు రూ.15 వేల కోట్లు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో 14 లక్షల కౌలు రైతు కుటుంబాలు, 10 లక్షలకుపైగా రైతు కూలీల కుటుంబాలున్నాయి. వీరితో కలిపి రైతు భరోసా కింద రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేల చొప్పున చెల్లించాలంటే రూ.20వేల కోట్లకుపైగా నిధులు అవసరం. ఇచ్చిన హామీ ప్రకారం ఆ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఎగ్గొట్టి… అందులో మూడోవంతు నిధులను రుణమాఫీకి మళ్లించి గొప్పలు చెప్పుకుంటూ సంబురాలు చేసుకోవడం సిగ్గు చేటు అని కేంద్ర మంత్రి మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల లోపు రైతులు తీసుకున్న అప్పులన్నింటికీ అసలు, వడ్డీతోసహా మొత్తాన్ని చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిబంధనలు, కొర్రీల పేరుతో ఇబ్బంది పెట్టకుండా బ్యాంకుల నుండి తీసుకున్న ఆయా రుణాల మొత్తాన్ని చెల్లించి ‘డిఫాల్టర్ల’ జాబితా నుండి రైతులను తొలగించి కొత్తగా రుణాలు మంజూరు చేయించేలా చర్యలు తీసుకుని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Telangana Assembly | ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు.. 25 లేదా 26న బడ్జెట్..!
Traffic SI | జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై బదిలీ వేటు..
Telangana | చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
Santosh Kumar | పెబ్బేరు గ్రామస్తులకు హ్యాట్సాఫ్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
KTR | డీజీపీగారు.. ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా: కేటీఆర్
Niranjan Reddy | అసలు రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
KTR | రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Job Aspirants | జన్మలో కాంగ్రెస్కు ఓటెయ్యం.. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతం: నిరుద్యోగులు