Heavy rains : హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh) రాష్ట్రంలోని చంబా జిల్లా (Chamba district) లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ భారీ వర్షాల ధాటికి పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. పదులకొద్దీ వాహనాలు బురదలో కూరుకుపోయాయి. పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల నివాసాల్లోకి బురద నీరు (Mud water) చేరింది. దాంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రహదారులు బురదతో మూసుకుపోవడంతో పలుచోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రోడ్లపై పడిన కొండచరియలను, బురదను తొలగించే పనిలో అధికారులు నిమగ్నయ్యారు. మరోవైపు చంబా-పఠాన్కోట్ జాతీయ రహదారిపై వెళుతున్న కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. అస్వస్థతకు గురైన చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.