AP News : విశాఖపట్నంలోని వాల్తేరు డిపో సమీపంలో నిలిపి ఉంచిన ఏపీఎస్ ఆర్టీసీ బస్సు మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి నెల్లూరు నుంచి ప్రయాణికులతో వచ్చిన ఈ బస్సును వాల్తేరు డిపో వద్ద నిలిపి ఉంచారు.
అయితే శనివారం తెల్లవారుజామున బస్సు ఇంజిన్ భాగం నుంచి అకస్మాత్తుగా పొగలు వెలువడ్డాయి. చూస్తుండగానే నిమిషాల వ్యవధిలోనే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయినప్పటికీ అప్పటికే బస్సు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదానికిగల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులు లేని సమయంలో ఈ ఘటన జరగడంతో పెను ముప్పు తప్పినట్లయిందని అందరూ ఊపిరి పీల్చుకున్నారు.