కారేపల్లి, జూలై 28 : తరచుగా విద్యుత్ ప్రసారం నిలిచిపోవడంతో ఆగ్రహించిన ప్రజలు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టిన సంఘటన మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామంలో స్థల దాత సహాయంతో అధికారులు విద్యుత్ సబ్ స్టేషన్ను నిర్మించారు. ఆనాడు స్థల దాతకు అధికారులు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలు చేయకపోవడంతో ఆగ్రహించిన ఆమె తరచుగా సబ్ స్టేషన్ లోకి చొరబడి విద్యుత్ ప్రసారాన్ని నిలిపివేస్తుంది. దీంతో కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్న సబ్ స్టేషన్ పరిధిలో గల గ్రామాల ప్రజలు స్థానిక సర్పంచులతో కలిసి ఇల్లెందు- కారేపల్లి ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు.
సుమారు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, సీఐ నూనావత్ సాగర్, ఎస్ఐ బైరు గోపి విద్యుత్ అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి విరమింపజేశారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ నుండి కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు. ఇప్పటికైనా తన సమస్యకు పరిష్కారం చూపించకపోతే మళ్లీ కరెంట్ సరఫరాను నిలిపివేస్తానని స్థల దాత హెచ్చరించడం కొసమెరుపు.

విద్యుత్ సమస్య పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించి ఆందోళన