హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ కొనసాగుతున్న విషయం విదితమే. భూ కబ్జాల ఆరోపణల నేపథ్యంలో ఈటల శాఖపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రి ఈటల నుంచి వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్కు బదిలీ చేశారు. సీఎం కేసీఆర్ సిఫారసుకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదం తెలిపారు.
ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణలపై కాసేపట్లో ప్రభుత్వానికి నివేదిక అందనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు ఈటల భూ కబ్జాలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావు తెలిపారు. అచ్చంపేట్, మాసాయిపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు తమ అసైన్డ్ భూములను ఈటల రాజేందర్ అక్రమంగా లాక్కున్నారని సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రైతుల ఫిర్యాదుతో సీఎం కేసీఆర్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు.. ఈటల హేచరీస్ పక్కన ఉన్న అసైన్డ్ భూముల్లో డిజిటల్ సర్వే నిర్వహిస్తున్నారు. మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. అచ్చంపేట, మాసాయిపేటలో మెదక్ కలెక్టర్ హరీష్ విచారణ చేశారు. రైతుల నుంచి వివరాలను సేకరించారు. క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తయిన తర్వాత నివేదిక ఇస్తామని కలెక్టర్ హరీష్ స్పష్టం చేశారు.
ఇవికూడా చదవండి..