హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు చేయవద్దని పీవోటీ చట్టం-1977 స్పష్టంగా చెప్తున్నది. కోర్టు నిషేధిత జాబితాలో ఉన్న భూములను ఇతరుల పేరుమీదికి బదలాయించడం సాధ్యం కాదు. కానీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రెండింటినీ ఉల్లంఘించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో హస్తగతం చేసుకున్న భూములే ఉదాహరణగా చూపుతున్నారు. అచ్చంపేటలోని సర్వే నంబర్ 81లో ఉన్న 5.36 ఎకరాల భూమి 2018 వరకు ఖరీజ్ ఖాతా కింద ఉండేది. ఈ భూమిని కొల్లి సీతారామారావు అనే వ్యక్తి పేరుమీదికి మార్చాలంటూ 2018 ఏప్రిల్ 22న ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ తర్వాత ఈ భూమిని 2020 మే 27న ఈటల రాజేందర్ తన భార్య జమున పేరుమీద కొనుగోలు చేసి రిజిస్టర్ చేయించినట్టు రికార్డుల ద్వారా తెలుస్తున్నది. అయితే ఈ సర్వేనంబర్ అసైన్డ్ భూమిగా పేర్కొంటూ రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ 2011 డిసెంబర్ 19న నోటిఫికేషన్ జారీచేసింది. ఇప్పటికీ ఆ భూమి ఇదే జాబితాలో ఉన్నది.
నిషేధిత జాబితాలో ఉన్న భూమికి పట్టా రావడం, ఆ తర్వాత కొనుగోలు చేయడం వెనుక మంత్రి ఈటల హస్తం ఉన్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రికార్డుల ప్రక్షాళన సమయంలోనే మంత్రి ఈటల చక్రం తిప్పారని చెప్తున్నారు. ఖరీజ్ ఖాతాలో ఉన్న 5.36 ఎకరాల భూమికి కొల్లి సీతారామారావు పేరిట పట్టా చేయించడం వెనుక ఆయన హస్తం ఉన్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేండ్ల తర్వాత ఆ భూమిని కొనుగోలుచేసి ఆయన తన భార్య ఈటల జమున పేరుమీద రిజిస్టర్ చేయించినట్టు రికార్డులను బట్టి తెలుస్తున్నది. రికార్డుల ప్రకారం కొల్లి సీతారామారావుకు హకీంపేట గ్రామంలోని 111/ఎ సర్వే నంబర్లో ఏడు ఎకరాల భూమి ఉన్నది. ఈ సర్వే నంబర్లోని భూమి న్యాయ వివాదంలో ఉండటంతో కోర్టు ఆదేశాల మేరకు 111 సర్వే నంబర్లోని 7.15 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఉంచారు.
ఈ మేరకు 2008 ఫిబ్రవరి 14న నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇదే భూమిని 2020 మే 18న కొల్లి సీతారామారావు నుంచి ఈటల రాజేందర్ తనయుడు ఈటల నితిన్ రెడ్డి కొనుగోలుచేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు రికార్డులను బట్టి తెలుస్తున్నది. కోర్టు నిషేధిత జాబితాలో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ అవడం వెనుక మంత్రి ఈటల రాజేందర్ అధికార బలాన్ని ఉపయోగించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరణి పోర్టల్లో వివరాలను అప్లోడ్ చేసే సమయంలో ఈ వివరాలను అధికారులు గుర్తించారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఈ రెండు సర్వే నంబర్లను పోర్టల్లో నిషేధిత జాబితాలో ఉంచినట్టు పేర్కొన్నది.
బెదిరించి భూమి లాక్కున్నరు
మాకు ఉన్నదే ఎకరంన్నర భూమి.. దాన్నికూడా ఈటల రాజేందర్ బామ్మర్ది సూరీ.. బెదిరించి లాక్కున్నాడు. మా భూమి అమ్మాలని ఒత్తిడి తెచ్చాడు. మేం అమ్మమని చెప్పినా వినిపించుకోలేదు. మా భూమి మాకు ఇవ్వాలని చాలాసార్లు ఆయన్ను బతిమిలాడినం. ఎక్కువ మాట్లాడితే పోలీస్స్టేషన్లో ఏసి కొట్టిస్తానన్నడు. అందుకే ఇక న్యాయం కోసం సీఎం కేసీఆర్కు లేఖ రాసినం. మా భూమి మాకు ఇప్పించాలని వేడుకుంటున్నాం.
మా భూమిలో రోడ్డు పోసిండ్రు
మా భూమిని అమ్ముతరా అని అడిగితే అమ్మమని చెప్పినం. అప్పటి నుంచి బెదిరిస్తున్నరు. వాళ్ల ఫీడ్ కంపెనీకి వెళ్లేందుకు మా భూమిలో నుంచే మట్టి రోడ్డు వేశారు. కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఇదేంటని అడిగితే ఏం చేస్తరో చేసుకోండని బెదిరిస్తున్నరు.
-ప్రభాకర్
అన్యాయంగా భూమి లాక్కున్నారు
ఎంత బతిమాలినా వినకుండా అన్యాయంగా భూమిని లాక్కున్నారు. ఇప్పుడు మా భూమిని మాకు ఇవ్వండి అంటే బెదిరిస్తున్నారు. గట్టిగా అడిగితే ఇక్కడ మీ భూమి లేనేలేదు.. అక్కడెక్కడో ఉన్నదని చెప్తున్నారు. ఆ ఎకరం జాగలోనే ఏదోఒకటి పండించుకొని బతుకుతున్నాం. ఇప్పుడు మా నోటికాటి కూడు లాగేసిండ్రు.
ఎట్లయినజేసి ఇప్పించండి
మాకు తెలియకుండానే మా భూమిలో రోడ్డు వేశారు. ఇదేంటని ప్రశ్నిస్తే దిక్కున్నచోట చెప్పుకొమ్మని బెదిరిస్తున్నారు. ఆ భూమి మీదనే ఆధారపడ్డ మాకు సీఎం కేసీఆర్ ఎట్లయినా సాయం చేయాలి.
నా భూమి వాళ్లదంటున్నరు
నాకు మూడెకరాల భూమి ఉన్నది. 28 ఏండ్ల నుంచి సాగు చేసుకుంటున్న. లక్షన్నర ఖర్చు పెట్టి సాపు చేయించుకున్న. ఇప్పుడు ఆ మంత్రి వచ్చి ఆ భూమి ఆయనదంటున్నడు. నా భూమేమో ఎక్కడో మీద ఉందని చెప్తున్నడు. నేను ఒక్కటే చెప్పినా.. తలకాయలు తెగినా సరే భూమి వదిలేది లేదని. నంబర్లు మార్చి మాయ చేస్తున్నరు.
భూముల్లోకి రానిస్తలేరు
మా ఊర్లో కంపెనీ పెడుతమని చెప్పి బెదిరించి భూములు తీసుకున్నరు. ఇందులో మా తండ్రి భూమి కూడా కబ్జా చేశారు. మాకు తెలువకుండనే అందులో షెడ్డు కట్టించిండు. ఇదేంటని అడిగితే మీ భూమి ఎక్కడుందని అంటున్నరు. ఆ భూమి వారిదంటున్నారు. మా భూములు మాకు కావాలంటే ఈటల బామ్మర్ది సూరీ వచ్చి బెదిరిస్తున్నడు. ఈ విధంగా ఒక్క మా ఊరిలోనే దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేశారు. ఆ భూమి ఉంటేనే మా కడుపు నిండుతుంది.
భూమి ఇవ్వాలని బెదిరిస్తున్నరు
ఈటల కంపెనీ పక్కనే మాకు 2.30 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని ఇస్తవా అని అడిగారు. ఇవ్వనని చెప్పిన. ఎంతోమందితో చెప్పిచ్చిండ్రు. ఎంత కావాలో అడుగు. సార్ దగ్గరికి వచ్చి తీసుకుపో అని బెదిరించిండ్రు. ఓసారి జేసీబీ పెట్టి చదును చేస్తుంటే ఆపినం. ఇప్పుడు చెప్పకుండనే మా భూమిలో రొడ్డువేసి గేటు పెట్టారు. ఇప్పటికే మా చిన్నాన్న కొడుకులది ఎకరం భూమి కబ్జా చేశారు.