హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం తమకు అసైన్ చేసిన భూములను కబ్జా చేసేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారని మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన బడుగు, బలహీనవర్గాల వారు ఆరోపించారు. దాదాపు వందమంది బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందినవారి నుంచి భూకేటాయింపు సర్టిఫికెట్లను దౌర్జన్యంగా స్వాధీనపర్చుకున్నారని పేర్కొన్నారు. రెండు గ్రామాల పరిధిలో దాదాపు వంద ఎకరాల అసైన్డ్ భూమి కబ్జాకు గురైందని తెలిపారు. కబ్జా చేసిన భూముల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు షెడ్లు నిర్మిస్తున్నారని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మా భూముల చెర విడిపించండి..
మంత్రి ఈటలపై సీఎం కేసీఆర్కు బాధితులు రాసిన లేఖ పూర్తిపాఠం
అయ్యా,
శ్రీయుత గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి
నమస్కరించి వ్రాయునది ఏమనగా
విషయం: మంత్రి ఈటల రాజేందర్ మరియు అతని అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేయుట మరియు గ్రామస్థులను బెదిరించుట గురించి
మేము మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారమైన చాకలి లింగయ్య, చాకలి బిచ్చవ్వ, చాకలి కృష్ణ, చాకలి నాగులు, చాకలి పరుశురాం, ఎరుకల దుర్గయ్య, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములు తమరికి సవినయముగా విన్నవించునది ఏమనగా, ప్రభుత్వం వారు 1994 సంవత్సరంలో మా కుటుంబాలకు సర్వే నంబర్ 130/5, 130/9, 130/10లలో ఎకరం 20 గుంటల చొప్పున, ఎరుకల దుర్గయ్యకు సర్వేనంబర్ 64/6లో 3 ఎకరాలు, ఎరుకల ఎల్లయ్య, ఎరుకల రాములుకు కొంతభూమిని అసైన్డ్ భూముల కింద కేటాయించడం జరిగింది.
గత కొన్ని నెలలుగా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఈటల రాజేందర్గారు, అతని అనుచరులు సూరి అలియాస్ అల్లి సుదర్శన్, యంజాల సుధాకర్రెడ్డి మా గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూములను అక్రమంగా స్వాధీనపరుచుకొనుటకు ఒక పథకం ప్రకారం వాటి కబ్జా ప్రక్రియకు తెరలేపినారు.
ఈ పథకంలో భాగముగా వారు మమ్ములను, మీ భూములను ప్రభుత్వం స్వాధీన పరుచుకుంటుంది అని భయభ్రాంతులకు గురిచేసి మాతోపాటు దాదాపు 100 మంది పేద బీసీ మరియు ఎస్సీ/ఎస్టీ కులాలకు చెందిన రైతుల యొక్క భూ కేటాయింపు సర్టిఫికెట్లను దౌర్జన్యంగా స్వాధీనపరుచుకున్నారు.
వారి భూదాహానికి మా ఇరు గ్రామాల పరిధిలోని సుమారు 100 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురికావడం జరిగింది. అట్టి భూములలో వారు నిబంధనలకు విరుద్ధంగా ఒక పెద్ద పౌల్ట్రీ పరిశ్రమ స్థాపనకు ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమంగా షెడ్ల నిర్మాణం యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. అక్రమంగా భూములను కబ్జా చేయడమే కాక వారి కార్యకలాపాలకు అడ్డుపడుతున్న కొంతమంది పేద బీసీ, ఎస్సీ/ఎస్టీ కులాలకు చెందిన రైతులను వారి చుట్టుప్రక్కల ఉన్న భూములను కూడా కబ్జా చేసి వారికి దారి ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే నువ్వు కూడా నీ భూమి మాకు అమ్మకో, లేదంటే నీ భూమికి శాశ్వతంగా దారిలేకుండా చేస్తాం అని బెదిరిస్తూ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని జులుం చేస్తున్నారు.
అయ్యా.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మాలాంటి నిరుపేద బీసీ, ఎస్సీ/ఎస్టీ కులాల రైతులకు సరైన న్యాయం తమరి ఒక్కరి వల్లే జరుగుతుంది. కావున మా ప్రార్థన మన్నించి తమరు తక్షణమే మంత్రి ఈటల రాజేందర్, అతని అనుచరుల కబంధ హస్తాలలో కబ్జాకు గురైన మా అసైన్డ్ భూములను వారి చర నుంచి విడిపించి తిరిగి మాకు అట్టి భూములపై శాశ్వత హక్కులు కల్పించగలరని మిమ్ములను సవినయంగా వేడుకుంటున్నాము.
ఇట్లు
చాకలి లింగయ్య,
చాకలి బిచ్చవ్వ D/o పెద్ద వెంకటయ్య,
చాకలి కృష్ణ S/o బిచ్చవ్వ,
చాకలి నాగులు,
చాకలి పరుశురాం S/o నాగులు
ఎరుకల దుర్గయ్య
ఎరుకల ఎల్లయ్య
ఎరుకల రాములు S/o సురేశ్
సురేశ్ S/o రాములు