మెదక్ : అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన రాబోయే నాలుగైదు నెలల్లో పూర్తి చేసి రైలు కూత పెట్టేలా చూడాలని మంత్రి హరీశ్ రావు రైల్వే అధికారులకు సూచించారు. రైల్వే లైన్ పనులు చివరి దశలో ఉన్నాయని, ఇంకా ఐదు శాతం పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని, ఇందుకు రూ.25 కోట్లు అవసరమని రైల్వే డివిజనల్ ఇంజినీర్ సధర్మ తెలిపారు. వెంటనే నిధులు విడుదల చేస్తామని మంత్రి తెలిపారు. ఆదివారం మెదక్ పట్టణంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని, కోటి 35 లక్షలతో జిల్లా దవాఖానలో ఏర్పాటు చేసిన వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నస్టిక్ ల్యాబ్ను ప్రారంభించారు.
అనంతరం రైల్వే, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులతో మెదక్ రైల్వే లైన్, సాగునీటి ప్రాజెక్ట్ ల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైల్వే లైన్ నిర్మాణానికి గత మార్చిలో 40 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రైల్వే కు ఇచ్చామన్నారు. మరో 25 కోట్లను వెంటనే మంజూరు చేస్తామని, పనులను త్వరితగతిన చేపట్టి వేగవంతం చేసి దసరా నాటికి రైల్వే స్టేషన్ ప్రారంభించేలా చూడాలని రైల్వే అధికారులను కోరారు.
అనంతరం ఘనపురం ఆనకట్ట, హల్దీ వాగు ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తూ ఘనపురం ఆనకట్ట ప్రాజెక్ట్ 1. 725 మీటర్ల ఎత్తు పెంచుటలో భాగంగా భూ సేకరణకు గతంలో రూ.5 కోట్లు మంజూరు చేసామన్నారు. భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసేందుకు మరో రూ.8 కోట్లు మంజూరు చేస్తామన్నారు. తద్వారా నీటి నిలువ సామర్థ్యాన్ని పెంచుకొని మరికొన్ని వేల ఎకరాలు సాగులోకి తేవొచ్చని మంత్రి తెలిపారు.
కొల్చారం వైపు కూడా మరికొంత భూ సేకరణకు ఎంత డబ్బు కావాలో సమీక్షించి త్వరగా అవార్డు పాస్ చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ హరీశ్ను ఆదేశించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఘనపురం ప్రధాన కాలువ లైనింగ్ ప్రక్రియ పూర్తి చేసుకున్నాం. కాలేశ్వరం నీళ్ల ద్వారా చిట్ట చివరి భూములకు కూడా సాగునీరందించేందుకు ఇంకా టేలెండ్ లో ఉన్న ప్రధానమైన కాలువలతో పాటు, డిస్ట్రిబ్యూటరీ నెట్ వర్క్ లైనింగ్ చేయడం కోసం 55 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ప్రభుత్వం పంపామని అన్నారు.
హల్దీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం, కాలువలు, సిమెంట్ లైనింగ్ కోసం 25 కోట్ల రూపాయల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, ఘనపురం, హల్దీ ప్రాజెక్ట్ లకు సంబంధించి నిధుల మంజూరుకు కృషి చేస్తామని అన్నారు. హల్దీ ప్రాజెక్టు మీద 6 చెక్ డ్యామ్లు, మంజీరా మీద 9 డ్యామ్లు నిర్మాణం చేపట్టి ఇంతవరకు 7 చెక్ డ్యామ్లు నిర్మించామని, మిగిలిన చెక్ డ్యామ్లు కూడా యుద్ధప్రాతిపదికన ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను రెండు, మూడు రోజులల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షల కోసం జిల్లాలో ర్యాపిడ్ టెస్టులు మాత్రమే చేసేవారన్నారు. జిల్లాలో ఆర్టీసీసీఆర్ ల్యాబ్ ను ఈరోజు ప్రారంభించాం. రేపటి నుంచి ఇది అందుబాటులోకి వస్తుందని దీనిని జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
దవాఖానలో సదుపాయాలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
రోగుల దగ్గరకు వెళ్లి ఆత్మీయతతో పలకరించండని, అదే వారికి సగం ధైర్యం ఇస్తుందని వారికి సూచించారు. అనంతరం పిల్లి కొట్టాల్ లో నిర్మిస్తున్న ఏసీహెచ్ దవాఖానకు వెళ్లే రహదారిని పరిశీలించి వెడల్పుగా బీటీ రోడ్డు నిర్మించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాన్ని పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ జి.రమేష్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్డౌన్తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్టైమ్ గ్రేట్స్లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు