ముంబై: ఇండియన్ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. కుంబ్లే, హర్భజన్ తర్వాత ఇండియన్ క్రికెట్పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్ బౌలర్ అశ్వినే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం అశ్విన్ మంచి స్పిన్నరే కావచ్చేమోగానీ.. అతన్ని ఆల్టైమ్ గ్రేట్స్లో కలపడం మాత్రం సరికాదని అంటున్నాడు. దీనికి అతడు చెప్పే బలమైన కారణం కూడా ఉంది. ముఖ్యంగా ఇండియన్ టీమ్ తడబడే సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో అశ్విన్ తనను తాను నిరూపించుకోలేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.
అశ్విన్ మంచి ప్లేయర్. కానీ అతన్ని ఆల్టైమ్ గ్రేట్స్లో కలపడం మాత్రం నాకు నచ్చలేదు అని అతడు స్పష్టం చేశాడు. ఈ నాలుగు దేశాల్లో అశ్విన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదని ఈ సందర్భంగా మంజ్రేకర్ గుర్తు చేశాడు. క్రికిన్ఫోకు చెందిన యూట్యూబ్ చానెల్లో మాట్లాడుతూ అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇండియాలో అశ్విన్కు తిరుగులేదని అంటారు. కానీ గడిచిన కొన్నేళ్లలో జడేజా కూడా అతనితో పోటీ పడి వికెట్లు తీశాడు. అందుకే అశ్విన్ మిగతా వాళ్ల కంటే గొప్పోడేమీ కాదు. ఇంగ్లండ్తో సిరీస్లో అయితే అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు తీశాడు. ఇందుకే నేను అశ్విన్ను ఆల్టైమ్ గ్రేట్గా అంగీకరించంది అని మంజ్రేకర్ అన్నాడు.
ప్రస్తుతం టెస్టుల్లో 409 వికెట్లతో ఇండియా తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న నాలుగో బౌలర్గా అశ్విన్ ఉన్నాడు. అశ్విన్ కంటే ముందు హర్భజన్, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే ఉన్నారు. ఇక టెస్టు ర్యాంకింగ్స్లో బౌలర్ల లిస్ట్లో రెండు, ఆల్రౌండర్ల లిస్ట్లో నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.