Madhira | మధిర, ఆగస్టు 11: మధిర–వైరా మార్గంలో పీవీఆర్ కళ్యాణమండపం ఎదురుగా ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లో మంగళవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు హత్యకు గురై ఉండవచ్చన్న అనుమానంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
మంగళవారం ఉదయం వెంచర్ పరిధిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు మధిర పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మధిర టౌన్ ఎస్ఐ నవిత సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం ఉన్న పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆధారాల సేకరణకు ఖమ్మం నుంచి క్లూస్ టీమ్ను రప్పించారు. నిపుణుల సహకారంతో ఘటనా స్థలంలో వేలిముద్రలు, ఇతర కీలక ఆధారాల కోసం పరిశీలన చేపట్టారు.
మృతుడిని మరెక్కడైనా హత్య చేసి, అనంతరం రాత్రి సమయంలో వాహనంలో తీసుకొచ్చి వెంచర్లో పడేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మృతుడి మరణానికి గల కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదు. మృతుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. చుట్టుపక్కల పోలీస్స్టేషన్ల పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసుల వివరాలను సేకరిస్తున్నారు. ఘటనపై మధిర టౌన్ సీఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.