Sonia Gandhi : బొగ్గు కుంభకోణం (Coal Scam) కేసులో దివంగత నేత, మాజీ ప్రధాని (Former PM) మన్మోహన్ సింగ్ (Manmohan Singh) కు సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవల క్లీన్ చిట్ ఇచ్చింది. దీనిపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandi) మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. మన్మోహన్ సింగ్ను అత్యంత ప్రభావశీలమైన ప్రధానిగా, మృదుస్వభావిగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంతో పోలిస్తే ఆయన తన నైతికత, జవాబుదారితనంతో పూర్తి భిన్నమైన వ్యక్తిగా కనిపిస్తారని పేర్కొన్నారు.
ఈ తీర్పుతో భారత రాజకీయాల్లో ఒక విషాదకర ఘట్టానికి ముగింపు పడిందని సోనియాగాంధీ అన్నారు. నీతి నిజాయతీ కలిగిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను దోషిగా నిలబెట్టే ప్రయత్నానికి ఫుల్ స్టాప్ పడిందని వ్యాఖ్యానించారు. ‘దివంగత నేత మన్మోహన్ సింగ్కు వ్యతిరేకంగా ఒక లాబీ పూర్తిసన్నద్ధతతో, సమన్వయంతో పనిచేసింది. అధికార గణం మొదలు న్యాయవ్యవస్థకు చెందిన వారు, పౌర సమాజం, ఆర్ఎస్ఎస్, బీజేపీ అందరూ ఉన్నారు. నాటి ఆరోపణలన్నీ బోగస్ అని నేడు రుజువైంది. మన్మోహన్ సింగ్ నిర్దోషి అన్న విషయం స్పష్టంగా తేలింది’ అని ఓ జాతీయ వార్త పత్రికలో సోనియా గాంధీ రాశారు.
ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ఈడీ, సీబీఐ వంటి సంస్థలను మోదీ ప్రభుత్వం దుర్వినియోగపరిచిందని కూడా ఎంపీ సోనియాగాంధీ ఆరోపించారు. ‘వాటి లక్ష్యం ప్రత్యర్థులపై ఒత్తిడి తేవడమే. కొందరి గొంతు నొక్కారు. మరికొందరిని బీజేపీలో కలిపేసుకున్నారు. మరికొన్ని అసాధారణ సందర్భాల్లో కొందరికి మంత్రి పదువులు కూడా దక్కాయి’ అని సోనియాగాంధీ విమర్శించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు దేశ పార్లమెంట్ చరిత్రలో అత్యంత దిగజారిన వ్యాఖ్యలుగా నిలిచిపోతాయని అన్నారు.