వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఎదురునిలిచే దమ్ము ఏ పార్టీకి లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం హన్మకొండలో కమలాపూర్ మండలంలోని 24 గ్రామాల ముఖ్య కార్యకర్తలతో వారు సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మండలంలో ప్రస్తుత పరిస్థితులపై కార్యకర్తలతో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ..పార్టీలు మారే వాళ్లతో టీఆర్ఎస్కు నష్టం ఏమీ లేదు. పార్టీ ఎజెండానే మన అందరి ఎజెండా అన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దాం. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు. బంగారు పల్లెంలో పెట్టి హుజురాబాద్ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఈటలకి ఇచ్చారు. కానీ వారు ఈరోజు దాన్ని కాపాడుకోలేకపోయారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్నో ఉద్యమాలు చేసినం. రాష్ట్రాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు.
టీఆర్ఎస్కు ద్రోహం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈటలకు సీఎం కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు. ఆత్మగౌరవం అంటూ ఢిల్లీలో పోయి తాకట్టు పెట్టారని విమర్శంచారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారని ప్రశంసించారు.
రైతు పండించిన ధాన్యాన్ని మద్దతు ధర కేటాయించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇది ఏ రాష్ట్రంలో లేదని పేర్కొన్నారు. తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రైతాంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని వినోద్ కుమార్ తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తామని వచ్చిన మీ అందరిని చూస్తుంటే సంతోషంగా ఉందన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకుంటుందన్నారు. కమలాపూర్ మండలంలో కార్యకర్తలకు అండగా నేనుంటానని కమలాపూర్ మండల ఇంచార్జి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హామీనిచ్చారు.
సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు సహకారంతో మీ సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని తెలిపారు.
కార్యక్రమంలో వరంగల్ అర్బన్ జిల్లా చైర్ పర్సన్ డాక్టర్ సుధీర్ కుమార్, రాష్ట్ర రైతు రుణ విమోచన చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్ రావు, మండల ఇంచార్జి పెరియాల రవీందర్ రావు, ఎంపీపీ, జెట్పీటీసీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, సమన్వయ కమిటీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు