మహబూబ్ నగర్ : ఆడపిల్లల పెళ్లి కోసం తల్లిదండ్రులు అప్పు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకం కింద చేస్తున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన హన్వాడ మండల పరిషత్ కార్యాలయంలో 58 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మండలంలో ఇప్పటి వరకు 1010 మంది లబ్ధిదారులకు 8 కోట్ల 9 లక్షల రూపాయల కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.
కరోనా తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ గ్రామాలలో ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను ఆపలేదని, తాగునీరు, విద్యుత్తు, పెన్షన్లు , కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. దీంతోపాటు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని ఎవరికైనా కరోనా లక్షణాలు ఉంటే వారికి మందులు ఇవ్వడంతోపాటు, అంబులెన్స్ ఏర్పాటు చేసి కరోనా సోకిన వారి ఇంటికే వెళ్లి చికిత్స అందిస్తున్నామన్నారు.
మండలంలో అన్ని గ్రామాలను కరోనా లేని గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపి సాగు నీరు ఇస్తామని అన్నారు. ప్రజలు, ప్రజా ప్రతినిధులు గ్రామాలలోని ప్రజలకు కరోనాపై మనోధైర్యం కల్పించాలని కోరారు.