హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 130వ జయంతి సందర్భంగా మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్తో కలిసి హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికీ సమాన హక్కులు ఉండాలని బాబాసాహెబ్ చెప్పారని మంత్రి కేటీఆర్ అన్నారు. బోధించు, సమీకరించూ, పోరాడు అని చెప్పారని, ఆయన మార్గంలోనే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని వెల్లడించారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి సంబంధించి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో ఈరోజే ఒప్పందం జరిగిందన్నారు. త్వరలోనే విగ్రహ నిర్మాణం చేపడతామన్నారు.
అంబేద్కర్ ఆశయ సాధన, ఆలోచనా విధానాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అణగారిన వర్గాల మేలుకోసం సంక్షేమబాటలో నడుస్తున్నదని చెప్పారు. ఏ సమానత్వం కోసమైతే అంబేద్కర్ పోరాడారో దానిని సాధించే దిశగా ఒక బృహత్తరమైన అజెండా తీసుకుని.. దాదాపు వెయ్యి గురుకులాలు స్థాపించామన్నారు. వాటిద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేద పిల్లలకు బ్రహ్మాండమైన అవకాశాలు అందిస్తూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..