Bellamkonda Srinivas | టాలీవుడ్లో ఈ ఏడాది పెళ్లి సందడి కొనసాగుతోంది. వరుసగా యువ హీరోలు వివాహ బంధంలోకి అడుగుపెడుతుండగా, ఇప్పుడు మరో కుర్ర హీరో పెళ్లి వార్తలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడు, టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. కొన్ని నెలలుగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వివాహంపై వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన లాయర్ కుటుంబానికి చెందిన యువతి కావ్య రెడ్డితో ఆయన పెళ్లి జరగబోతున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కావ్య రెడ్డి తాతగారు జడ్జిగా పనిచేసి రిటైర్ అయ్యారని, ఆమె తండ్రి ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నట్లు సమాచారం.
ఇక ఈ వారంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఎంగేజ్మెంట్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బెల్లంకొండ కుటుంబం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. సినీ కెరీర్ విషయానికి వస్తే, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 2014లో వచ్చిన అల్లుడు శీను సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వరుసగా పలు సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
గతేడాది విడుదలైన భైరవం, కిష్కింధపురి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు. ప్రస్తుతం ఆయన టైసన్ నాయుడు, హైందవ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలు త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఒకవైపు కెరీర్లో కొత్త సినిమాలతో ముందుకు సాగుతూనే, మరోవైపు వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి వార్తలు అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అన్నదానిపై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.