న్యూఢిల్లీ, ఆగస్టు 12: ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన ప్రక్రియను కేంద్రం శీతాకాల సమావేశాల్లో చేపట్టే అవకాశం ఉంది. జస్టిస్ వర్మ ఇంట్లో లభించిన నోట్ల కట్టలకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా వేసిన త్రిసభ్య విచారణ కమిటీ ఆరోపణలను నిర్ధారిస్తూ పార్లమెంట్లో బుధవారం నివేదికను సమర్పించింది. దీంతో గతంలో నిల్చిపోయిన అభిశంసన ప్రక్రియను వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చేపడుతారని భావిస్తున్నారు. వాస్తవానికి ఆయన తన ఉద్యోగానికి రాజీనామా సమర్పించినప్పటికీ దానిని కేంద్ర న్యాయ శాఖ నోటిఫై చేయలేదు.
అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో ఆయన పేరు కొనసాగుతూనే ఉంది. అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్న ఒక న్యాయమూర్తి కేవలం రాజీనామా చేసినంత మాత్రన ఆభిశంసన ప్రక్రియ నుంచి తప్పించుకోలేరన్న సందేశాన్ని దీని ద్వారా ఇవ్వాలని పలువురు ఎంపీలు భావిస్తున్నారు. అయితే వర్మ రాజీనామాతో అభిశంసన ప్రక్రియ తానంతట తానే ముగిసిపోయిందని కొందరు న్యాయ నిపుణులు పేర్కొన్నారు. కాబట్టి ఆయనపై ఇప్పుడు అభిశంసన పెట్టడం కుదరదని అంటున్నారు. అయితే అభియోగాలు రుజువైన క్రమంలో ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చునని కొందరు పేర్కొంటున్నారు.
ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై విచారణ జరిపిన త్రిసభ్య కమిటీ ఆయనపై మోపిన మూడు ఆరోపణలను నిర్ధారించింది. లెక్కలోకి రాని నగదు భారీ మొత్తంలో ఆయన అధికార నివాసంలో లభ్యమైందని, ఆ నగదుకు సంబంధించిన భౌతిక సాక్ష్యాధారాలను భద్రపర్చ లేదని, దీనిపై ఆయన ఇచ్చిన వివరణ తప్పించుకునే విధంగా, అసంతృప్తిగా ఉందని కమిటీ పేర్కొంది.
గత ఏడాది మార్చి 14న ఢిల్లీ తుగ్లక్ రోడ్లోని జస్టిస్ వర్మ ఇంట్లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీనిపై విచారణకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సెప్టెంబర్లో ముగ్గురు సభ్యులతో ఒక సంయుక్త విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. న్యాయమూర్తి ఇంట్లోని స్టోర్ రూమ్లో పెద్దమొత్తంలో రూ.500 నోట్లు ఉన్నట్టు కమిటీ నిర్ధారించింది.