రామగిరి, మార్చి 06 : సమాజంలో విభిన్న పాత్రలను సమర్ధవంతంగా పోషిస్తూ దేశ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్న మహిళల కృషి అనిర్వచనీయం అని ఎంజీయూ వీసీ ప్రొ.ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. అయితే ప్రతి ఒక్కరు మహిళా హక్కులను పరిరక్షిస్తూ వారికి సముచిత స్థానం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శుక్రవారం యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశ భవిష్యత్లో నేడు మహిళలు సాధిస్తున్న అసాధారణ విజయాలు, అనేక సవాళ్లను ఎదుర్కొంటూ పురోగతి సాధించడాన్ని ఆయన వివరిస్తూ కీర్తించారు.
ఓయు జర్నలిజం విశ్రాంత ప్రొఫెసర్, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ డ్రాఫ్టింగ్ కమిటీ సభ్యురాలు పద్మజ షా మాట్లాడుతూ.. మహిళా సాధికారతకు మద్దతుగా నిలవడం సామాజిక అవసరం, బాధ్యతగా ఉందన్నారు. కుటుంబాలు, సంస్థలు, సమాజ పురోగతిలో మహిళల గణనీయమైన పాత్రను పోషిస్తూ అన్ని రంగాల్లో పురోగతికి స్త్రీల పాత్ర మూలంగా ఉందన్నారు. నార్కట్పల్లి ఎస్ఐ కోట కరుణాకర్ మాట్లాడుతూ.. మహిళా భద్రత, శ్రేయస్సు పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరాల నుండి తమను తాను రక్షించుకోవాలన్నారు. అంతే కాకుండా బాధ్యతాయుతమైన ప్రవర్తనతోనే ఇతరులకు మార్గదర్శకంగా ఉండవచ్చని తెలిపారు. ఉన్నత విద్యావంతులుగా ఎదిగి సమాజంలోని నేడు సమస్యగా మారిన మాదకద్రవ్యాలు, సైబర్ క్రైం, హింసకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేయాల్సిన కర్తవ్యం నేటి యువత, విద్యార్థులపై ఉందన్నారు.
అనంతరం వర్సిటీలో మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వకృత్వం, పోస్టర్ పెయింటింగ్, పాటల పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఎంజీయూ ఇంటర్నల్ సెల్ డైరెక్టర్, వర్సిటీ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.వసంత అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇంజినీరింగ్ కళాశాల డీన్ ప్రొఫెసర్ రేఖా, వివిధ విభాగాల ప్రొఫెసర్స్, అసిసెంట్ ప్రొఫెసర్స్, ఇంటర్నల్ సెల్ సభ్యులు ప్రొ.శ్రీలక్ష్మి, డా.లక్ష్మీప్రభ, వర్సిటీ వివిధ విభాగాల మహిళా అధ్యాపకులు, విద్యార్ధినులు, బోధన, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు.

దేశాభివృద్ధిలో మహిళల పాత్ర అనిర్వచనీయం : ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్