హైదరాబాద్ : జూరాల( Jurala ) కింద ఉన్న భీమా ఫేజ్-1, 2, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ లిఫ్ట్లతో పాటు జూరాల కాలువలు, కేఎల్ఐ కింద ఉన్న మూడు పంపులను తక్షణమే ప్రారంభించాలని బీఆర్ఎస్ నాయకుడు,మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ( Niranjan Reddy ) డిమాండ్ చేశారు. హైదరాబాద్లో తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసినా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ నెల 11 వరకు పంపులను ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలసి లక్షలాది మంది రైతులతో నార్లాపూర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అక్కడ రైతులు, ప్రజలతో కలిసి చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. పాలమూరు బిడ్డనని చెప్పుకుంటూ..పాలమూరుకు నీళ్లు ఇవ్వకుండా ఏపీకి నీళ్లు తరలించేందుకు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నాడని విమర్శించారు.
రెండున్నరేళ్ల నుంచి పాలమూరు-రంగారెడ్డిలో తట్టెడు మట్టి కూడా ఎత్తకుండా పడావు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 802 మీటర్ల వద్ద కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి నీళ్లు ఎత్తిపోసి దిగువన ఉన్న రైతాంగాన్ని ఆదుకోవచ్చని సూచించారు. 854 మీటర్లలో నీళ్లు ఉన్నా నీళ్లను ఎందుకు ఎత్తిపోయడం లేదని ప్రశ్నించారు.
కృష్ణా నదికి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నా, నీళ్లే లేవంటూ రైతాంగాన్ని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం, పాలమూరు రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన లేకపోవడం విచారకరమని నిరంజన్ రెడ్డి అన్నారు. కర్నాటకలోని జలవనరులన్నీ నిండిపోగా వృథాగా పోయే నీటితోనే రోజుకు 5వేల క్యూసెక్కుల నీరు డిసెంబర్ వరకు జూరాలకు వస్తాయని తెలిపారు. దీని వల్ల పాలమూరుకు పుష్కలంగా నీరు ఇవ్వవచ్చని తెలిపారు.