– ప్రియుడికు వాట్సాప్ చాటింగ్లో మెసేజ్
– పోలీస్ స్టేషన్లో భర్త ఫిర్యాదు
ఖమ్మం రూరల్, ఆగస్టు 07 : నా భర్తను చంపేయ్ ఇంట్లో మాత్రం వద్దు, ఎవరితోనైనా యాక్సిడెంట్ చేయించి చంపాలి.. ఇలా ఓ ఇల్లాలు తన ప్రియుడికి వాట్సాప్ లో మెసేజ్ పెట్టిన సంఘటనకు సంబంధించిన ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం.. మహబూబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావుకు సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం గ్రామానికి చెందిన భవానీతో 2016 సంవత్సరంలో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉంటూ రాజేశ్వరరావు ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో భవాని కొరియర్ బాయ్ గా పని చేస్తున్న సైదులుతో పరిచయం పెంచుకుంది.
రాజేశ్వరరావు గత నెల 27వ తేదీన మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వచ్చిన సమయంలో భార్య భవాని వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండడాన్ని చూసి కోపోద్రిక్తుడయ్యాడు. భవాని వ్యవహార శైలిపై నాగేశ్వరావు మరుసరి రోజే తన స్వగృహం చిలుకోడులో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. ఇందుకుగాను పక్క గ్రామంలో ఉన్న తన అన్నను తీసుకురావడానికి అదే రోజు వెళ్తున్న సమయంలో భవాని ప్రియుడు సైదులు వెంబడించిన దృశ్యాన్ని పసిగట్టిన రాజేశ్వరరావు చాకచక్యంగా తప్పించుకుని చిలుకూరు గ్రామానికి చేరుకున్నాడు.
భార్యపై మరింత అనుమానం రావడంతో భవాని సెల్ ఫోన్లు చెక్ చేయగా ఫోన్లో నివ్వరపోయే సమాచారం బయటపడింది. తన ప్రియుడికి చేసిన చాటింగ్లో ఎలాగైనా సరే అతడిని చంపేయాలి.. కానీ ఇంట్లో కాకుండా బయటి వారితో యాక్సిడెంట్ చేసి చంపాలి.. లేదా నేను చనిపోతా అంటూ వాట్సాప్లో పెట్టిన మెసేజ్ ని చూసిన రాజేశ్వరరావు స్క్రీన్ షాట్ వెంటనే తీసుకోవడం జరిగింది. అనంతరం రాజేశ్వరరావు ఈ నెల 1వ తేదీన డోర్నకల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన డోర్నకల్ పోలీసులు కేసును ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఉద్దేశంతో గురువారం మరోమారు రూరల్ పోలీస్ స్టేషన్లో రాజేశ్వర్రావు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదును స్వీకరించిన రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగిందని, విచారణ చేపడుతున్నట్లు తెలిపారు.