సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 3 : ప్రభుత్వం తమకు అండగా నిలిచిందని, సీఎం కేసీఆర్కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని షీ-క్యాబ్, మొబైల్ టిఫిన్ సెంటర్, వేప నూనె తయారీ లబ్ధి దారులు సంతోషం వ్యక్తం చేశారు. షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పైలట్ పథకం లబ్ధిదారులతో ఆ సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ ముఖాముఖి నిర్వహించారు. శనివారం సంగారెడ్డి జిల్లాను సందర్శించిన ఎండీ కలెక్టరేట్ ఆవరణలో లబ్ధిదారులను కలిసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు పథకం ద్వారా వారు పొందిన అనుభవాలను వెల్లడించారు. ప్రతినెలా పెట్రోల్, నిర్వహణ ఖర్చు, బ్యాంకు ఈఎంఐ తదితర ఖర్చులు పోనూ నెలకు రూ.15వేలు లాభం వస్తున్నదని షీ-క్యాబ్ లబ్ధిదారులు తెలిపారు. ప్రతిరోజు ముడిసరుకులు, ఇంధనం ఇతర ఖర్చులు పోనూ రోజుకు రూ.2వేల లాభం వస్తున్నదని మొబైల్ టిఫిన్ సెంటర్ లబ్ధిదారులు తమ అనుభవాలను చెప్పారు. కుటుంబ, వ్యవసాయ కార్యక్రమాలను కొనసాగిస్తూనే అదనంగా వేప నూనె ఉత్పత్తి ద్వారా ప్రతినెలా రూ.15 వేల లాభం వస్తున్నదని వేప నూనె, వేప పిండి ఉత్పత్తి లబ్ధిదారులు తెలిపారు.
అనంతరం షెడ్యూల్డ్ కులాల సేవా సహకార అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపట్టిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ బడుగు వర్గాల అభ్యున్నతి షీ-క్యాబ్, మొబైల్ టిఫిన్ సెంటర్, వేప నూనె తయారీ వంటి వినూత్న కార్యక్రమాలను అందిస్తున్నారని వివరించారు. జిల్లాలో ఆయా పథకాల ద్వారా జీవనం కొనసాగిస్తూ తమ కుటుంబాలను పోషించుకుంటున్న లబ్ధిదారులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాల జిల్లా కార్యనిర్వాహక అధికారి బాబూరావు, లబ్ధిదారులు పాల్గొన్నారు.