లాక్డౌన్ కష్టాలను అధిగమించేందుకు 7 లక్షల విలువైన 67 కార్ల టైర్లు దొంగతనం
కారు ఈఎంఐ చెల్లించేందుకు కొత్త ఆలోచన
అర్ధరాత్రి కారు అడ్డంపెట్టి టైర్లు ఊడబీకి..
ఓఎల్ఎక్స్లో విక్రయించిన శ్రీకాంత్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): సాధరణంగా ఓ కారు టైరు విప్పాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ, శ్రీకాంత్కు కేవలం 2 నిమిషాలు చాలు. కారుకు ఉన్న నాలుగు టైర్లలో రెండింటిని మాత్రమే విప్పుతాడు. టైర్ల చోరీ కోసం కారులో తిరుగుతాడు. తన కారును అడ్డంపెట్టి ఇతర కార్ల టైర్లను దొంగిలిస్తాడు. ఇలా శ్రీకాంత్ రూ.7 లక్షలు విలువ చేసే 67 కార్ల అలాయ్ వీల్స్ (టైర్లు)ని ఎత్తుకెళ్లాడు. శ్రీకాంత్, అతనికి సహకరించిన వ్యక్తిని రాచకొండ పోలీసులు ఇటీవల అరెస్టు చేసినప్పుడు విచారణలో ఆసక్తికర విషయం తెలిసింది.
కారు ఈఎంఐ కట్టకపోవడంతో..
లాక్డౌన్లో క్యాబ్లు సరిగా నడవకపోడంతో యాదిగిరిగుట్ట ప్రాంతానికి చెందిన శ్రీకాంత్ ఆర్థికంగా ఇబ్బంది పడ్డాడు. ఈఎంఐ కూడా కట్టలేకపోయాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు అలాయ్ వీల్స్ చోరీకి శ్రీకారం చుట్టాడు. ఎల్బీనగర్, మీర్పేట్, సరూర్నగర్లో చాలామంది ఇంటి బయటే వాహనాలను పార్క్చేస్తున్న విషయాన్ని గమనించి ఆ ప్రాంతాలను చోరీలకు ఎంచుకున్నాడు. అర్ధరాత్రి తర్వాత స్పాట్కు చేరుకొని ఎంచుకున్న కారు టైర్లను తొలగించేవాడు. ఇలా 67 కార్ల టైర్లను చోరీచేశాడు. వాటిని ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేశాడు. ఇటీవల నేరేడ్మెట్ ప్రాంతంలో పోలీసు తనిఖీల్లో భాగంగా శ్రీకాం త్ కారు డిక్కీలో రెండు టైర్లు కనిపించాయి. విచారించగా ఆ టైరును చోరీచేశానని ఒప్పుకున్నాడు. ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేసి ఆరా తీశారు.
సీసీ కెమెరాలకు చిక్కకుండా రేడియం స్టిక్కర్లు
దర్యాప్తును ప్రారంభించిన పోలీసులు ముందుగా సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు. దీంతో వారికి టైర్లు చోరీ జరిగిన ప్రతిచోటా ఓ డిజైర్ కారు కనిపించింది. ఆ తర్వాత ఆ కారు కదలికలను మ్యాపింగ్చేశారు. చోరీ జరిగిన ఎల్బీనగర్ ప్రాంతం నుంచి ఉప్పల్ వరకు కారు కనిపించింది. మీర్పేట్లో జరిగిన టైరు చోరీ కేసులో కూడా ఆ కారు స్పాట్ నుంచి ఉప్పల్ వైపు వెళ్లింది. ఇలా దాదాపు ప్రతి టైరు చోరీ కేసు తర్వాత కారు ఉప్పల్ వైపు వెళ్లడం కనిపించింది. నంబర్ మాత్రం కనిపించడంలేదు. కారణం ఆ దొంగ నంబర్ ప్లేటుకు రేడియం స్టిక్కర్ వేశాడు. దీంతో రాత్రి కావడంతో లైట్ల ఫోకస్కు నంబర్ కనపించలేదు. ఇటీవల శ్రీకాంత్ తన స్నేహితుడితో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లాడు. సీసీ కెమెరాల తనిఖీల్లో భాగంగా ఆ మార్గంలో టోల్ ప్లాజా కెమెరాలను పరిశీలించారు. అక్కడ వాహనం నంబర్ కనిపించింది. దానిని ఆరా తీస్తే ఈ టైర్లను చోరీ చేసిన దొంగలు శ్రీకాంత్, బాలకిషన్ అని తేలింది. వారిని రాచకొండ పోలీసులు ఇటీవల అరెస్టుచేశారు. వారినుంచి 49 టైర్లు, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇవి కూడా చదవండి..
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
గజ్వేల్ మార్కెట్ దేశానికే మోడల్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
మహనీయుల జయంత్యుత్సవాలు నిర్వహించాలి
అగ్రకులాల పేదలు అభివృద్ధి చెందాలి