Venkaiah Naidu | హైదరాబాద్ : తెలంగాణ, ఏపీ రాష్ట్రాలను వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్షాలు, వరదలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వ్యక్తిగత పెన్షన్ నుంచి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ. ఐదు లక్షల చొప్పున సహాయం అందజేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు.
కుండ పోత వర్షాలు, ఉదృతమైన వరదలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వాటిల్లుతున్న నష్టం తనను తీవ్రంగా కలచివేసింది అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ప్రధానమంత్రి మోదీకి ఫోన్ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించి, వెంటనే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాను. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇప్పటికే మాట్లాడానని, అక్కడి ప్రభుత్వాల యంత్రాంగాలతో, కేంద్ర అధికారులు టచ్లో ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. రెండు రాష్ట్రాలకు తగిన సహాయ సహకారాలు అందజేస్తామని ప్రధానమంత్రి హామీ ఇచ్చారని మాజీ ఉప రాష్ట్రపతి తెలిపారు.
నా వంతు సహకారంగా నా వ్యక్తిగత పెన్షన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. ఐదు లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. ఐదు లక్షలు సహాయ చర్యల నిమిత్తం పంపించాను. ఈ కష్టకాలంలో ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నాను. యువత కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సహాయక చర్యల్లో పాల్గొవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మా కుమారుడు ముప్పవరపు హర్షవర్ధన్ నిర్వహిస్తున్న ముప్పవరపు ఫౌండేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేశారు. మా కుమార్తె దీపా వెంకట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ 2.5 లక్షలు అందజేసినట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Trains Cancelled | వరదల ప్రభావం.. మరో 49 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
Heavy rains | ఆ జిల్లాలో విద్యా సంస్థలకు రేపు కూడా సెలవు
Jagadish Reddy | హెలికాప్టర్ మాట్లాడకుండా.. ముఖ్యమంత్రి ఏం చేశారు ? మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్