Harish Rao | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి రోడ్ల మీద చేస్తున్న సర్కస్ ఫీట్లు చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.
మొదటి రోజు శాసనసభకు అదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద నిరసనగా టీషర్ట్స్ వేసుకొని వస్తే అడ్డుకున్నారు. తమను సభా ప్రాంగణంలోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఈ రోజు రాజ్ భవన్ వద్ద అదానీ అవినీతి గురించి మాట్లాడినట్లు రేవంత్ సర్కస్ చేసిండు. అక్కడికి వెళ్లి కూడా కేసీఆర్ గురించి, బీఆర్ఎస్ గురించే మాట్లాడిండు తప్ప, అదానీ అవినీతి గురించి మాట్లాడింది తక్కువ. మీ పోరాటం అదానీ మీద అయితే మొదటి రోజు మమ్మల్ని ఎందుకు అసెంబ్లీ రాకుండా అడ్డుకున్నావు. నిరసన తెలిపే అవకాశం కూడా ఎందుకు ఇవ్వలేదు. మేము అడుగుతున్నా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టడం లేదు అని రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు.
దావోస్ వెళ్లి అదానీతో రూ. 12,400 కోట్ల అగ్రిమెంట్లు చేసుకున్నవు. నీకు నిజంగా అదానీ అవినీతి మీద పోరాటం చేయాలనుకుంటే ముందు వెంటనే అగ్రిమెంట్లు రద్దు చేయ్. నీ మాటల్లో నిజాయితీ ఉంటే, వంద కోట్లు వాపస్ ఇచ్చినట్లు రూ. 12,400 కోట్ల అగ్రిమెంట్ రద్దు చేసుకోవాలి. అగ్రిమెంట్లు రద్దు చేసి నీ చిత్తుశుద్దిని నిరూపించుకో రేవంత్ రెడ్డి అని హరీశ్రావు సవాల్ చేశారు.
రామన్నపేటలో డ్రైపోర్టు కోసం ల్యాండ్ ఇస్తే సిమెంట్ ఫ్యాక్టీరికి అనుమతి ఇచ్చావు. అదానీ కోసం పోలీసులను పెట్టి అరెస్టులు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశావు. పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ చేశావు. అదానీకి ఏజెంట్గా కొమ్ముకాస్తున్నావు. ప్రజల కోరిక మేరకు సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. డైవర్షన్ పాలిటిక్స్, సర్కస్ ఫీట్లు తప్ప ఇంకే లేదు. మీ డబుల్ స్టాండర్డ్కు నిదర్శనం మీ చిత్తశుద్ది లేని పోరాటం అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
అదానీ దేశ పరువు తీసిండు అని రేవంత్ రాజ్ భవన్ వద్ద అన్నడు. మరి నువ్వు దావోస్ వెళ్లి ఒప్పందాలు చేసుకొని తెలంగాణ పరువు తీశావు. అదానీకి రెడ్ కార్పెట్ వేసి రాష్ట్ర పరువు తీశావు. ఢిల్లీలో పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పరువును తీశావు.
అదానీ, రేవంత్ అక్రమ సంబంధం మీద రేపు అసెంబ్లీలో చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నీకు ఆ ధైర్యమే లేదు. అంతర్గతంగా ఒప్పందం మీకు ఉంది. సీఎం రాజ్ భవన్ వద్ద ట్రాఫిక్ జాం చేసిండు. ధర్నాలో పాల్గొన్న అందరి మీద నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కేసులు నమోదు చేయాలి. ధైర్యం ఉంటే, చట్టం అందరికి సమానం అయితే వారి మీద కేసులు పెట్టండి అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress | కాంగ్రెస్ కార్యకర్తల అత్యుత్సాహం.. పెళ్లిపీటలపై ఆగిన ఐపీఎస్ వివాహం
Harish Rao | అసెంబ్లీ బయట డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు పెట్టాలి.. హరీశ్రావు సంచలన వ్యాఖ్యలు
Union Minister | కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింపు.. ఎందుకంటే?