Harish Rao | హైదరాబాద్ : ఉత్తర దిక్కు ట్రిపుల్ ఆర్ బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. ఇవాళ ట్రిపుల్ ఆర్ బాధితులు హరీశ్రావును కలిసి తమ బాధలను విన్నవించారు.
భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో బాధితులకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేత హామీ ఇప్పించి ఇప్పుడు మాట మార్చడం దౌర్భాగ్యమని హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తీరు ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటినంక బోడి మల్లన్న చందంగా ఉందని ధ్వజమెత్తారు. ట్రిపుల్ ఆర్ ఏర్పాటు విషయంలో ఉత్తర భాగంలో 40 కిలోమీటర్లకు బదులుగా 28 కిలో మీటర్లను పరిగణలోకి తీసుకొని జంక్షన్ ఏర్పాటు చేయడం వల్ల చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని హరీశ్రావు తెలిపారు.
చౌటుప్పల్ మధ్య నుండి రోడ్డు వెళ్లడం వలన మున్సిపాలిటీ రెండు భాగాలుగా విడిపోతున్నదనీ, బాధితులు రెండు పంటలు పండించే పచ్చని పొలాలను, ఇండ్లు, ప్లాట్లను కోల్పోతున్నారని పేర్కొన్నారు. చౌటుప్పల్ వద్ద జంక్షన్ రింగు గతంలో 78 ఎకరాల్లో ఉంటే ఇప్పుడు 184కు పెంచడం వల్ల పేదల భూములు, ప్లాట్లు కోల్పోతున్నారు. దీనికి గాను నష్టపరిహారం కూడా తక్కువ చెల్లిస్తున్నారు. దక్షిణ భాగాన ట్రిపుల్ ఆర్ కోసం ఎలాగైతే 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారో, ఉత్తర బాగానే ఉన్న చౌటుప్పల్ వైపు 40 కిలోమీటర్లు పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్రావు స్పష్టం చేశారు.
కోమటిరెడ్డి ఎంపీగా ఉన్నపుడు బాధితులతో కలిసి ట్రిపుల్ ఆర్ మార్చాలని, రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నాలు చేశారు. పార్లమెంటు ఎన్నికల సందర్భంలోనూ అలైన్మెంట్ మార్చుతామని హామీలు ఇచ్చారు. కానీ, ఇప్పుడేమో అదే పోలీసు బలగాలతో, నిర్బంధంగా రోడ్డుకు 28 కిలోమీటర్ల పరిధిలోనే సర్వే చేయించి, ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెట్టాలని బలవంత పెట్టడం దుర్మార్గం. ఇదెక్కడి న్యాయం. ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాటనా..? అని హరీశ్రావు నిలదీశారు.
నాడు ఫార్మా సిటీ అన్నారు, నేడు మాట మార్చారు. నాడు ట్రిపుల్ ఆర్ రోడ్డు అలైన్మెంట్ మార్పు అన్నారు.. నేడు మాట మార్చారు. మాట మార్చడమే మీ విధానమా? ప్రజలను మభ్య పెట్టడమే కాంగ్రెస్ పద్దతా? మీ మాటలు ప్రజలు నమ్మడం లేదని, ప్రియాంక గాంధీ చేత హామీలు చెప్పించి, మాట తప్పారు. భువనగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రియాంక గాంధీతో.. ట్రిపుల్ ఆర్ భూములు కోల్పోయిన రైతులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పించారు. కానీ, అధికారంలోకి రాగానే బాధితుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తూ తీవ్ర మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. వేధిస్తూ దాడులకు దిగుతున్నారు అని హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా మీద విమర్శలు చేయడం ఆపి ఎన్నికల్లో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి. ఇప్పటికైనా కళ్లు తెరిచి హామీ అమలు చేయండి. లేదంటే బాధితుల ఆగ్రహానికి గురికాక తప్పదు. బాధితులు, రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరిస్తున్నాం. ఎన్నికల ప్రచార సభల్లో మీరు ఇచ్చిన హామీలను మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రియాంక గాంధీ చొరవ తీసుకొని బాధితుల సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డిని, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆదేశించాలని కోరుతున్నాం. ప్రియాంక గాంధీ గారు మీరైనా ఇచ్చిన మాట మీద నిలబడతారా? లేదా కాంగ్రెస్ నైజమే ఇంత అని మాట తప్పుతారా? అని హరీశ్రావు ప్రశ్నించారు.
ఉత్తర దిక్కు RRR బాధితులకు న్యాయం చేస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామిని నిలబెట్టుకోవాలని ప్రియాంకా గాంధీ, సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిలను బిఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.… pic.twitter.com/sx7euTKpYg
— Harish Rao Thanneeru (@BRSHarish) September 24, 2024
ఇవి కూడా చదవండి..
KTR | దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టు ఉంది.. బండి సంజయ్పై కేటీఆర్ ఫైర్
KTR | అనగనగా ఓ చిట్టి నాయుడు.. ఆయనకు ఏడుగురు అన్నదమ్ముళ్లు.. రేవంత్ కథ ఇదీ..!
Heavy Rains Alert | తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలే.. హెచ్చరించిన వాతావరణశాఖ