Heavy Rains Alert | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు భారీ వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి సగటున 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి వైపునకు వంగి ఉందని చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని చెప్పింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, భువనగిరి జిల్లాల్లోనూ ఈదురుగాలులతో వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు భారీగా ఈదురుగాలులతో వర్షాలు పడే సూచనలున్నాయని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.