న్యూఢిల్లీ, ఆగస్టు 6: దేశంలో భారీ, నిర్మాణాత్మకంగా బలమైన సంస్థలు.. రాబోయే సంవత్సరాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని అన్నారు. ఆటోమేషన్, కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇందుకు కారణం కాగలవని అభిప్రాయపడ్డారు. గురువారం ఇక్కడ జరిగిన ఎన్సీఏఈఆర్ ఇండియా పాలసీ ఫోరమ్ 2026లో నీలేకని పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని లక్షలాది చిన్న వ్యాపారాలే జాబ్ మార్కెట్కు కీలకం కాబోతున్నాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చేవి ఇవేనని ఎన్సీఏఈఆర్లో గవర్నర్ల బోర్డు చైర్మన్ కూడా అయిన నీలేకని పేర్కొన్నారు. కొత్తగా వచ్చే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొనే క్రమంలో బడా సంస్థలు మానవ శక్తి కంటే యాంత్రిక, ఏఐ ఆధారిత రోబోటిక్ వ్యవస్థలపైనే ఆధారపడుతారని, దీంతో కొత్త ఉద్యోగాలను పక్కనబెడితే ఉన్న ఉద్యోగాలూ ఊడిపోక తప్పదని అంచనా వేశారు.
ఇదే సమయంలో భారతీయ ఉద్యోగ, ఉపాధి అవకాశాల భారాన్ని దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది చిన్న సంస్థలు, కోట్లాది చిరు వ్యాపారులే మోస్తారని చెప్పుకొచ్చారు. కాగా, 2035నాటికి దేశంలో 10 లక్షల స్టార్టప్లుంటాయని నీలేకని అంచనా వేశారు. ప్రస్తుతం 1.5 లక్షలుగానే ఉన్నాయన్నారు. కాబట్టి రాబోయే ఈ మార్పును ప్రోత్సహించేలా దేశంలో వ్యాపార నిర్వహణ, పెట్టుబడుల సమీకరణను సులభతరం చేయాలన్నారు.