న్యూఢిల్లీ, ఆగస్టు 6: బంగారం ధరలు వరుసగా మూడోరోజూ పెరిగాయి. గురువారం ఒక్కరోజే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.3,800 ఎగిసింది. దీంతో 7 వారాల గరిష్ఠ స్థాయిని తాకుతూ రూ.1,53,800కు చేరింది. జూన్ 18 (రూ.1,53,400) తర్వాత ఇదే అత్యధికం మరి. అంతకుముందు రెండు రోజుల్లో రూ.2,600 పెరిగిన విషయం తెలిసిందే. ఇక వెండి ధరల విషయానికొస్తే.. రూ.2,100 పుంజుకొని కిలో రూ.2,34, 800 పలికింది. బుధవారం రూ.6,200 ఎగబాకిన సంగతి విదితమే. కాగా, హైదరాబాద్లో 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.2,650 పెరిగి రూ. 1,37,250గా ఉన్నది.
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతూపోతుండటం వెనుక అనేక కారణాలున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో పశ్చిమాసియాలో నెలకొన్న అశాంతి తొలగిపోతుండటం, హొర్ముజ్ జలసంధిలో తిరిగి నౌకల రవాణాకు మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తుండటం, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పడుతుండటం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. క్రూడాయిల్ రేట్లు దిగితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోనుండటం, తద్వారా అమెరికా ఫెడ్ రిజర్వ్, ఆర్బీఐ సహా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు జోలికి వెళ్లవన్న అంచనాలు మదుపర్లలో నెలకొనడం కూడా గోల్డ్, సిల్వర్కు డిమాండ్ను తెచ్చిపెడుతున్నదని అంటున్నారు. అలాగే డాలర్ విలువ, అమెరికా బాండ్ రాబడులు సైతం మార్కెట్ను ప్రభావితం చేస్తున్నట్టు గుర్తుచేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 4,264.24 డాలర్లు పలికింది. సిల్వర్ 61.80 డాలర్ల వద్ద నిలిచింది. మరోవైపు ఫ్యూచర్ మార్కెట్లోనూ బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. గురువారం మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఎక్స్)పై అక్టోబర్ డెలివరీకిగాను రూ.654 పెరిగి రూ.1,49,147 వద్ద ట్రేడైంది. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడితే అటు స్పాట్ మార్కెట్లో, ఇటు ఫ్యూచర్ మార్కెట్లోనూ ధరలు పరుగులు పెట్టడం ఖాయమని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 29న దేశీయంగా 24 క్యారెట్ గోల్డ్ తులం మునుపెన్నడూ లేనివిధంగా రూ.1,83,000 పలికినది తెలిసిందే. కిలో వెండి తొలిసారి రూ.4,04,500గా నమోదైంది. అయితే గల్ఫ్ వార్ దెబ్బకు బంగారం ధర దాదాపు రూ.40,000 వరకు, వెండి రేటు సుమారు రూ.1,80,000 వరకు క్షీణించాయి.