లక్నో: భార్యకు మరో వ్యక్తితో అక్రమ సంబంధం ఉన్నట్లు భర్త అనుమానించాడు. ఈ నేపథ్యంలో రాత్రి వేళ ఇంట్లో నిద్రిస్తున్న భార్యపై కత్తితో దాడి చేశాడు. ఆమె తల నరికి దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. అతడ్ని అరెస్ట్ చేసి ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. (Man Beheads Sleeping Wife) ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పర్వేజ్, 28 ఏళ్ల నగ్మాకు 12 ఏళ్ల కిందట వివాహమైంది. కుటుంబ ఆస్తి పంపకాల తర్వాత తన పూర్వీకుల ఇంటిని అతడు విక్రయించాడు. గత నెలన్నర రోజులుగా హర్దోయ్లోని ఇస్లాంనగర్ తిలియా ప్రాంతంలో అద్దె ఇంట్లో భార్యతో కలిసి నివసిస్తున్నాడు.
కాగా, భార్య నగ్మా మరో వ్యక్తితో ఫోన్లో తరచుగా మాట్లాడటంతో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నదని భర్త పర్వేజ్ అనుమానించాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9 రాత్రి వేళ పర్వేజ్ దారుణానికి పాల్పడ్డాడు. నగ్మ గాఢ నిద్రలో ఉండగా పదునైన కత్తితో ఆమెపై దాడి చేశారు. భార్య తల నరికి మెడ నుంచి వేరుచేసి హత్య చేశాడు.
ఆ తర్వాత పర్వేజ్ స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. భార్యను హత్య చేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న నగ్మా మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోలీసులు పర్వేజ్ను అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.