జైపూర్, ఆగస్టు 6: ఎలాంటి ప్రసంగాలు, నినాదాలు, ప్లకార్డుల సందడి లేకుండా రాజస్థాన్లోని బీజేపీ ప్రభుత్వ మెడలు వంచారు మూగ, బధిర విద్యార్థులు. సమస్యల సాధనకు ఉద్వేగ ప్రసంగాలు, గొంతు చించుకుంటూ కేకలు వేయనవసరం లేదని మౌన నిరసనతో నిరూపించారు. ఒక్క నినాదం, ఒక్క ప్లకార్డు కూడా లేకుండా సమస్యల సాధనకు వారు తెలిపిన నిరసనకు అధికారులు పరుగెత్తుకు రాగా, నేతలు దిగివచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి హుటాహుటిన ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ను తొలగించారు.
తమ పాఠశాలకు సరిపడా సంఖ్యలో టీచర్లు లేరని, తాగునీటి సౌకర్యం లేదని, మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. స్కూల్ భవనం బీటలు వారి శిథిలావస్థకు చేరుకుందని, అది ఏక్షణంలో కూలుతుందో తెలియని దుస్థితిలో ఉందని తెలిపారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జైపూర్లోని సేఠ్ ఆనందిలాల్ పొద్దర్ హయ్యర్ సెకండరీ ప్రభుత్వ పాఠశాల మూగ, చెవిటి విద్యార్థులు ఆందోళనకు దిగారు. వారంతా నిశ్శబ్దంగా పాఠశాల ఎదుట బైఠాయించి మౌనంగా తమ నిరసన తెలిపారు. ఇది తెలిసిన వెంటనే అక్కడికి ప్రతిపక్ష, అధికార పక్ష నేతలు చేరుకున్నారు. విద్యా శాఖ వెంటనే స్పందించి ఒక అధికార బృందాన్ని పాఠశాలకు పంపింది.
వారు స్కూల్ను తనిఖీ చేసి విద్యార్థులు లేవనెత్తిన సమస్యలన్నీ నిజమేనని నిర్ధారించారు. ఇన్నాళ్లు పాఠశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రిన్సిపాల్ భరత్ జోషిని వెంటనే ఆ పదవి నుంచి తొలగించారు. అలాగే ఒక టీచర్, నాలుగో తరగతి ఉద్యోగిని తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు. పాఠశాలలోని టీచర్ల కొరతతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడమే కాక, దీనిపై ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. మూగ, బధిర విద్యార్థుల నిరసన పలువురిలో స్ఫూర్తిని నింపింది. బీజేపీ సర్కార్ మెడలు వంచిన వారికి పలువురు అభినందనలు తెలిపారు.