Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం.. గురుకుల విద్యార్థులకు శాపంగా మారిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అనారోగ్యం పాలై నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని లీలావతిని హరీశ్రావు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మీడియాతో మాట్లాడారు.
వికారాబాద్ జిల్లా తాండూరు గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ నెల 10న కిచిడీ తిని 15 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. మంచి ఆసుపత్రికి పంపకుండా హాస్టల్లో ఉంచి వారికి చికిత్స అందించారు. నాలుగు రోజులు గడించింది. అయినా వారు పూర్తి ఆరోగ్యవంతులు కాలేదు. విద్యార్థిని లీలావతిని నిమ్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. తోటి విద్యార్థులతో ఆడుతూ, పాడుతూ బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన ఆ చిన్నారి.. మౌనంగా ఇలా నిమ్స్ ఆసుపత్రి బెడ్పై ఉండటం చూస్తే మనసు కలిచివేస్తున్నది. ఆ విద్యార్థిని త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నది అని హరీశ్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
వాంకిడి గురుకుల విద్యార్థులకు చికిత్స అందించడంలో జరిగిన వైఫల్యం ఇక్కడ కనిపిస్తున్నది. మొన్న శైలజ మృతికి ప్రభుత్వం కారణం అయ్యింది. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్లు జరిగి విద్యార్థులు ఆసుపత్రుల పాలవుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా కాదు, కనీసం సొంత జిల్లా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలను సైతం పట్టించుకోని నిర్లక్ష్యపు ముఖ్యమంత్రి ఈ రేవంత్ రెడ్డి. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ అభం శుభం తెలియని విద్యార్థులకు శాపం అవుతున్నదని ప్రాణాలను బలిగొంటుందని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావడం లేదు అని హరీశ్రావు పేర్కొన్నారు.
విద్యా మంత్రి, ఎస్సీ, ఎస్టీ మంత్రి కూడా రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖల నిర్వహణలో వైఫల్యం. చూడడానికి వెళ్తే ప్రతిపక్ష నాయకులను అడ్డుకుంటారు. సబితా ఇంద్రా రెడ్డిని, సత్యవతి రాథోడ్ని అరెస్టు చేశారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడంపై ఉన్న ధ్యాస, కనీసం జిల్లాలో ఉన్న పిల్లల భవిష్యత్తుపై లేదా? నిన్న నల్గొండ – కేతేపల్లి మండలం గురుకులంలో ఐదో తరగతి చదువుతున్న నీలం సాయి గణేష్ పాము కాటుకు గురయ్యాడు. ఆసుపత్రి పాలయ్యాడు. ఫుడ్ పాయిజన్ కేసులు, కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కరెంటు షాక్లు నిత్య కృత్యం అవుతున్న ప్రభుత్వం ముద్దు నిద్ర వేడడం లేదు. ఇప్పటి వరకు 49 మంది విద్యార్థులు చనిపోతే ఉలుకు లేదు పలుకు లేదు అని హరీశ్రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినికి హరీశ్రావు పరామర్శ
Adilabad | బహిర్భూమికి వెళ్లిన మహిళపై చిరుత దాడి
Aadhar Update | ఆధార్ ఉచిత అప్డేట్ గడువు మరోసారి పొడిగింపు.. ఎప్పటి వరకు అంటే..?