భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ) : వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా చూడాలని కలెక్టర్ అంకిత్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన నీటిపారుదల సలహా సంసిద్ధత సమావేశంలో జిల్లాలోని నీటి లభ్యత, తాగునీటి అవసరాలు, చెరువులు, మధ్యతరహా ప్రాజెక్టుల నీటి నిల్వలు, వర్షపాతం పరిస్థితి, సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు తదితర అంశాలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి సాగును తగ్గించి.. తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులను ప్రోత్సహించాలని సూచించారు.
తాగునీటి అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో ఎక్కడ కూడా కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతుల ఇళ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని, నీటి లభ్యతకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకునేలా రైతులను ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో నీటి అవసరాలను ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో మొత్తం 2,384 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా.. 598 చెరువులు 0-25 శాతం, 965 చెరువులు 25-50 శాతం, 587 చెరువులు 50-75 శాతం, 207 చెరువులు 75-100 శాతం నిండి, మిగులు నీటితో ఉన్నట్లు అధికారులు కలెక్టర్కు వివరించారు. సమావేశంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఇరిగేషన్ ఎస్సీ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు తదితరులు పాల్గొన్నారు.