హైదరాబాద్ : సీఎం కేసీఆర్ దేవుడు. అడగ్గానే వరాలు ఇచ్చారు. నర్సింగ్ విద్యార్థులకు ప్రతి నెల స్టయిఫండ్ రూ. 1,500 నుంచి రూ. 5,000 పెంచిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని నర్సింగ్ విద్యార్థులు, అధికారులు స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. నగరంలోని సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రార్ విద్యావతి, డిప్యూటీ డైరెక్టర్ నర్సింగ్ విద్యుల్లత, ప్రొఫెసర్లు సునీత, పద్మ జాయిని హర్షం వ్యక్తం చేశారు.
భారీ ఎత్తున స్టయిఫండ్ పెంచిన ఘనత దేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే దక్కుతుందని వారు స్పష్టంచేశారు. మొదటి సంవత్సరం రూ. 5,000, రెండో సంవత్సరం రూ. 6,000, మూడో సంవత్సరం రూ. 7,500 స్టయిఫండ్ పెంచడం చారిత్రాత్మక నిర్ణయం అని వారు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని నర్సింగ్ హబ్గా మార్చేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు అందుకు దోహదం చేస్తున్నాయని వారు అన్నారు.
నర్సింగ్ వ్యవస్థకు జీవం పోసే విధంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారని వారు తెలిపారు. నర్సింగ్ వ్యవస్థకు పండుగ వాతావరణం సంతరించుకుందని, సీఎం కేసీఆర్ నిర్ణయాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏక కాలంలో 13 నర్సింగ్ కాలేజీలను మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని వారు తెలిపారు.
రాష్ట్రంలో సుమారు 60 వేల మంది నర్సింగ్ విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని వివరాలను వెల్లడించారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో నర్సింగ్ విద్యను అభ్యసిస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలు ఆ విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటలో వేసినట్లు అయిందని అధికారులు పేర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం