న్యూఢిల్లీ: దేశంలో పెట్రో వడ్డన ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత కొన్ని రోజులు పెట్రోల్ ధరలు క్రమం తప్పకుండా పెంచుకున్న కంపెనీలు.. అప్పుడప్పుడు డీజిల్ వినియోగదారులపై దయతలుస్తున్నాయి. నిన్న పెట్రో, డీజిల్ ధరలను పెంచిన కంపెనీలు.. తాజాగా పెట్రోల్పై మాత్రమే వడ్డించాయి. రోజువారీ ధరల సమీక్షలో భాగంగా లీటర్ పెట్రోల్పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.99.86కు చేరింది. ఇప్పటికే దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. మరోమారు ధరలు పెరిగినట్లయితే ఈ రాష్ట్రాల జాబితాలో ఢిల్లీ కూడా చేరనుంది. ఇక డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో రూ.89.36 వద్ద స్థిరంగా ఉన్నది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై లీటర్ పెట్రోల్ రూ.105.92, డీజిల్ రూ.96.91గా ఉన్నది. కోల్కతాలో పెట్రోల్ రూ.99.84, డీజిల్ రూ.92.27, చెన్నైలో పెట్రోల్ రూ.100.75, డీజిల్ రూ.93.91, బెంగళూరులో పెట్రోల్ రూ.103.20, డీజిల్ రూ.94.72, హైదరాబాద్లో పెట్రోల్ రూ.103.78, డీజిల్ రూ.97.40కు చేరింది.