న్యూఢిల్లీ: తీవ్రత ఎక్కువగా ఉన్న కొత్త వేరియంట్లు వెలుగుచూస్తే, మూడోవేవ్లో వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందొచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కరోనా నిబంధనలను పాటించకపోయినట్లయితే, వచ్చే అక్టోబర్-నవంబర్ నాటికి దేశంలో థర్డ్వేవ్ గరిష్ఠస్థాయికి చేరుకోవచ్చన్నారు. అయితే, సెకండ్వేవ్లో నమోదైన రోజూవారీ కేసులతో పోలిస్తే, మూడోవేవ్లో వాటిలో సగం మాత్రమే నమోదవుతాయని తెలిపారు. ఈ మేరకు కొవిడ్-19 వ్యాప్తిని గణిత పద్ధతుల్లో అంచనావేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్యానెల్లోని సభ్యుడు మనీంద్ర అగర్వాల్ వెల్లడించారు.‘సూత్ర మోడల్’ను అభివృద్ధి చేసిన ఈ బృందం మూడోవేవ్ సంభావ్యతను మూడు రకాలుగా అంచనావేసింది. వ్యాక్సినేషన్ను వేగవంతం చేస్తే మూడు, నాలుగు వేవ్ల ప్రమాదం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.
వైద్యులకు భారతరత్న ఇవ్వాలి: కేజ్రీవాల్
భారతదేశ అత్యున్నత పురస్కారమైన ‘భారతరత్న’ను ఈ ఏడాది భారతీయ వైద్యులకు ఇవ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనాపై పోరాటంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య సిబ్బంది నిస్వార్థంగా సేవలందించారని, ఆ క్రమంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. భారతరత్న అవార్డును వైద్యులకు అందించడం వారికి నిజమైన నివాళి అని లేఖలో పేర్కొన్నారు.
బ్రిటన్లో 19న లాక్డౌన్ ఎత్తివేత!
వ్యాక్సినేషన్ విజయవంతం కావడం, కరోనా కేసులు తగ్గిన నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని బ్రిటన్ నిర్ణయించింది. ఈనెల 19 నుంచి అన్ని ఆంక్షలను ఎత్తివేయనున్నట్టు బ్రిటన్ గృహ నిర్మాణ మంత్రి రాబర్ట్ జెనెరిక్ తెలిపారు.