CM KCR | ‘మానవీయ దృక్పథం లేని ప్రగతి నిరర్థకమని నేను నమ్ముతాను. పేదల కన్నీరు తుడవని, కడుపు నింపని పాలన.. పాలన అనిపించుకోదు. అందుకే తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధితో పాటు, ప్రజా సంక్షేమానికి కూడా సింహభాగం నిధులను ఖర్చు చేస్తోంది’ అని సీఎం కేసీఆర్ (Cm KCR) అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం సీఎం ప్రసంగించారు.
గత ప్రభుత్వాలు ఆసరా పెన్షన్లకింద కేవలం 200 రూపాయలు మాత్రమే చెల్లించేవని.. అవికూడా అర్హులందరికీ చేరేవి కావని సీఎం కేసీఆర్ అన్నారు. లబ్ధిదారులకు కనీసం ఒక్క పూటైనా కడుపు నింపని ఆ పెన్షన్ల వల్ల ప్రయోజనం ఏముంది..? అని ప్రశ్నించారు. అందుకే, తెలంగాణ రాష్ట్రంలో పింఛను కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2,016లకు, దివ్యాంగులకు చెల్లించే పెన్షన్ను 3,016 రూపాయలకు పెంచినట్లు చెప్పారు.
పెన్షన్ మొత్తాన్ని పెంచడంతో పాటు, లబ్ధిదారుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచినట్లు సీఎం తెలిపారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటుగా, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులకు కూడా పెన్షన్ అందిస్తున్నట్లు చెప్పారు. 2014లో పెన్షన్ లబ్ధిదారులు 29 లక్షలు ఉండగా, నేడు 44 లక్షలకు పైగా పెరిగారన్నారు. పెన్షన్ పొందేందుకు వయోపరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించడంతో లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగిందని సీఎం కేసీఆర్ వివరించారు.
పేదింటి ఆడపిల్లల పెళ్ళి తల్లిదండ్రులకు భారంగా మారకూడదని కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ పథకం కింద ఒక లక్షా 116 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 13 లక్షల 16 వేల మంది ఆడపిల్లల వివాహాలను ప్రభుత్వం జరిపించిందన్నారు. ఇందుకోసం రూ.11 వేల కోట్లకు పైగా వెచ్చించినట్లు చెప్పారు.
Also Read..
Cm KCR | బృహత్తరమైన పథకం మిషన్ కాకతీయ.. రూ.5,350 కోట్లతో చెరువులను పునరుద్ధరించాం : సీఎం కేసీఆర్
CM KCR | విద్యుత్తు సరఫరాలో తెలంగాణ కీర్తి.. పవర్ హాలిడేలే లేవు : సీఎం కేసీఆర్