CM KCR | 60 ఏళ్ల పరిపాలనలో ఏ ఒక్క ప్రభుత్వమూ విద్యుత్తు సమస్యను పరిష్కరించలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మాత్రం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించిందన్నారు. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించిందని చెప్పారు.
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా (Telangana Decade celebrations) హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘వ్యవసాయానికి చాలినంత విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో పంటలెండిపోయి రైతన్నలు పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. జనజీవితంలో జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అనివార్యమైపోయాయి. పదేపదే మోటార్లు కాలిపోయేవి. టపాసుల వలె ట్రాన్స్ ఫార్మర్లు పేలిపోయేవి. పవర్ హాలిడేలతో పరిశ్రమలు కునారిల్లిపోయేవి. పారిశ్రామికవేత్తలు ఇందిరాపార్కు దగ్గర ధర్నాకు దిగాల్సిన దయనీయ పరిస్థితి ఆవరించి ఉండేది. తెలంగాణ వస్తే రాష్ట్రం అంధకార బంధురమవుతుందని, తీగెల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని సమైక్య పాలకులు ఎద్దేవా చేశారు. శాపనార్ధాలు పెట్టారు. కానీ, వారి అంచనాలను తలకిందలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో విప్లవాత్మక విజయాలు సాధించింది. నేడు అన్ని రంగాలకు నిరంతరాయంగా 24 గంటల పాటు, వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్తు సరఫరా చేసే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కీర్తి దేశం నలుదిశలా వ్యాపించింది’ అని సీఎం తెలిపారు.
ఇప్పుడు తెలంగాణ రైతుకు కరెంటు లేక నీళ్ళు ఆగిపోతాయనే దిగులు లేదు, మోటర్ కాలిపోతదన్న భయం లేదు అని సీఎం అన్నారు. చివరి మడి దాకా తడి ఒక్కతీరుగ అందుతోందన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కోసం ప్రభుత్వం ఏటా 12 వేల కోట్లు ఖర్చు చేస్తూ రైతు సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకుంటోందని చెప్పారు. దేశ ప్రధాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ రాష్ట్రంలో ఒక్కో జిల్లాలో ఒక్కో రోజు చొప్పున పవర్ హాలిడే ప్రకటిస్తుంటే.. దశాబ్దిలో అడుగుపెడుతున్న పసికూన తెలంగాణ రాష్ట్రంలో క్రాప్ హాలిడేలు, పవర్ హాలిడేలు అనే మాటే లేదు అని పేర్కొన్నారు. అందుకే ఈరోజు తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయిందని సీఎం చెప్పుకొచ్చారు.
‘తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడే నాటికి స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 7,778 మెగావాట్లు కాగా, నేడు అది 18,453 మెగావాట్లకు పెంచుకోగలిగాం. రాష్ట్రం ఏర్పడిన నాడు సోలార్ పవర్ ఉత్పత్తి 74 మెగావాట్లు మాత్రమే ఉండగా, నేడది 5,741 మెగావాట్లకు పెంచగలిగాం. సౌర విద్యుదుత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ విద్యుత్తు రంగాన్ని తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం త్రిముఖ వ్యూహాన్ని అనుసరించింది. సంస్థలో అంతర్గత సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. ప్లాంటులోడ్ ఫ్యాక్టర్ పెంచుకుంది. పంపిణీలో నష్టాలను నివారించుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చత్తీస్గఢ్ తో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల వార్దా నుంచి హైదరాబాద్ కు 765 కె.వి. డీసీ లైను నిర్మాణానికి అవకాశం ఏర్పడింది. ఉత్తర, దక్షిణ గ్రిడ్ ల మధ్య పి.జి.సీ.ఐ.ఎల్. ఆధ్వర్యంలో కొత్త లైన్ల నిర్మాణం జరిగింది. దీంతో దేశంలో ఎక్కడి నుంచైనా విద్యుత్తును ఇచ్చి పుచ్చుకునే అవకాశం ఏర్పడింది.
శాశ్వతంగా సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త పవర్ స్టేషన్లను నిర్మించింది. రికార్డు సమయంలో కేటీపీఎస్ 7వ దశ నిర్మాణాన్ని పూర్తి చేసింది. భూపాలపల్లి, జైపూర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తిచేసి 1800 మెగావాట్ల విద్యుత్తును అదనంగా అందుబాటులోకి తెచ్చింది. జూరాల, పులిచింతల నుంచి 360 మెగావాట్ల హైడల్ పవర్ సమకూర్చింది. తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లో ఉత్పత్తి ప్రారంభమైంది. 4000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో టీఎస్.జెన్కో దామరచర్లలో నిర్మిస్తున్న యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంటు నిర్మాణం తుదిదశకు చేరుకుంది. త్వరలోనే ఈ ప్లాంట్ ఫలితాలు మనకు అందనున్నాయి’ అని సీఎం తెలిపారు.
ఉత్పత్తితోపాటు సరఫరాను మెరుగు పరచడంలో కూడా తెలంగాణ విద్యుత్తు సంస్థలు ఎంతో ప్రగతి సాధించాయని సీఎం చెప్పారు. 22,502 కోట్ల రూపాయల వ్యయంతో సబ్ స్టేషన్ల నిర్మాణం, పవర్ ట్రాన్స్ ఫార్మర్ల ఏర్పాటు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ ఫార్మర్లు, కొత్త లైన్ల నిర్మాణం చేయడంతో పంపిణీ వ్యవస్థ బలోపేతమైందన్నారు. నేడు తలసరి విద్యుత్తు వినియోగంలో సైతం తెలంగాణ ఎంతో ముందుందని చెప్పారు. 2014-15లో తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు కాగా, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగిందన్నారు. ఇదే సమయంలో జాతీయ సగటు 1,255 యూనిట్లు మాత్రమే ఉందన్నారు. అంటే జాతీయ తలసరి వినియోగం కన్నా తెలంగాణలో తలసరి విద్యుత్తు వినియోగం 69 శాతం ఎక్కువ అని సీఎం కేసీఆర్ వివరించారు.
Also Read..
CM KCR | దేశ చరిత్రలోనే కాళేశ్వరం అపూర్వ ఘట్టం : సీఎం కేసీఆర్
CM KCR | సంక్షేమంలో స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిన తెలంగాణ: సీఎం కేసీఆర్