CM KCR | సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం.. అనే నినాదంతో సంక్షేమంలో తెలంగాణ స్వర్ణయుగాన్ని ఆవిష్కరించిందని, అభివృద్ధిలో అగ్రపథాన నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. 2014లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే ఉండేదని, తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతితో నేడు రాష్ట్ర తలసరి ఆదాయం రూ.3,17,115 పెరిగిందని చెప్పారు. పదేండ్ల చిరుప్రాయంలో ఉన్న తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోని పెద్ద రాష్ట్రాలకన్నా మిన్నగా నిలిచిందని వెల్లడించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ లాంఛనంగా ఆరంభించారు. అనంతరం ఉద్యోగులతో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. 2014లో రాష్ట్ర జీఎస్డీపీ (GSDP) విలువ రూ.5,05,849 కోట్లు మాత్రమే ఉండగా, నేడు రాష్ట్రంలోని అన్నిరంగాలూ ఆర్ధికంగా పరిపుష్టి కావడంతో రాష్ట్ర జీఎస్డీపీ రూ.12,93,469 కోట్లకు పెరిగిందన్నారు. అంటే కరోనా, డీ మానిటైజేషన్ వంటి సంక్షోభాలు ఏర్పడినప్పటికీ తట్టుకొని 155 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తూ, దశాబ్ది ముంగిట తెలంగాణ నిలిచిందని వెల్లడించారు.
‘ఇవాళ రాష్ట్రంలో కరెంటు కోతలు లేవు, ఎటుచూసినా వరికోతలే కనిపిస్తున్నాయి. తలసరి విద్యుత్తు వినియోగంలో తెలంగాణ దేశంలోనే ప్రప్రథమ స్థానంలో నిలిచి, ప్రగతి బావుటాను సగర్వంగా ఎగురవేసింది. ఎత్తిపోతలతో తరలించిన నదీ జలాలతో తెలంగాణ బీడుభూములన్నీ తరిభూములయ్యాయి. తెలంగాణ తాగునీటి వ్యథలకు మిషన్ భగీరథ (Mission Bhagiratha) చరమగీతం పాడింది. వృత్తి పనులవారికి ఆర్థిక ప్రేరణనివ్వడంతో తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్టి చేకూరింది. పల్లె ప్రగతితో (Palle Pragati) గ్రామీణ జీవన ప్రమాణాలు పెరిగినాయి. మన ఆదర్శ గ్రామాలు జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకుంటున్నాయి. పట్టణాలు, నగరాలు పరిశుభ్రతకు, పచ్చదనానికి నిలయాలై ప్రపంచస్థాయి గుర్తింపును పొందుతున్నాయి. ఏ విషయంలో చూసినా, ఏ కోణంలో చూసినా అనేకరంగాల్లో తెలంగాణ నంబర్ వన్గా నిలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే.. నిన్నటి ఉద్యమ తెలంగాణ నేడు ఉజ్వల తెలంగాణగా వాసికెక్కింది.
దశాబ్ది ఉత్సవాల కానుకగా బీసీ కులవృత్తుల కుటుంబాలకు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థికసాయం అందిస్తున్నామని చెప్పడానికి నేనెంతో ఆనందిస్తున్నా. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి, మేదరి తదితర కుటుంబాల వారికి దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. అదేవిధంగా గొల్ల కుర్మలకు భారీ ఎత్తున గొర్రెల పంపిణీని చేపట్టిన సంగతి తెలిసిందే. తొలి విడతలో రూ.6,100 కోట్లతో 3.93 లక్షల మంది లబ్ధిదారులకు 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. ప్రస్తుతం రెండో విడతలో భాగంగా రూ.5 వేల కోట్లతో 3.38 లక్షల మందికి గొర్రెల్ని పంపిణీ చేసే కార్యక్రమం దశాబ్ది ఉత్సవాల్లోనే ప్రారంభమవుతుంది
తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ ఆదివాసీ గిరిజనుల చిరకాల ఆకాంక్షను తెలంగాణ ప్రభుత్వం తీరుస్తున్నదని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పోడు సమస్యకు శాశ్వత పరిష్కారంగా గిరిజనులకు తెలంగాణ ప్రభుత్వం భూములపై హక్కులు కల్పిస్తున్నది. జూన్ 24 నుంచి పోడు పట్టాల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. అటవీ భూములపై ఆధారపడిన లక్షా 50వేల మంది ఆదివాసీ, గిరిజనులకు 4 లక్షల ఎకరాల పోడు భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తున్నది. దీనికి రైతుబంధు పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నది.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే సేకరించి ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్హులకు ఇండ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి ఉన్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను పేదల ఇండ్ల నిర్మాణాల కోసం కేటాయిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా దానివెనుక ఉండేది మానవీయ కోణమే. పేదలు అనుభవించే ప్రతి సమస్యనూ సూక్ష్మంగా అర్థం చేసుకొని పరిష్కరించే దిశగానే ప్రభుత్వం యొక్క ప్రతి ప్రయత్నమూ కొనసాగుతున్నది. గర్భిణులలో రక్తహీనత సమస్యను నివారించడం కోసం, గర్భస్థశిశువు ఆరోగ్యంగా ఎదగడం కోసం ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన పోషకాహారాన్ని న్యూట్రిషన్ కిట్ల ద్వారా ప్రభుత్వం అందజేస్తున్నది. ఇప్పటికే ఈ పథకం 9 జిల్లాల్లో ప్రారంభమై మంచి ఫలితాలను సాధిస్తున్నది. ఈ దశాబ్ది ఉత్సవాల్లోనే మిగతా 24 జిల్లాల్లోనూ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని ప్రభుత్వం ప్రారంభిస్తున్నది.
సొంతస్థలం ఉండి కూడా ఇండ్లు నిర్మించుకోలేని పేదల కోసం గృహలక్ష్మి అనే పథకాన్ని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళల పేరిట అమలు చేసే ఈ పథకాన్ని జూలై నెలలో ప్రారంభిస్తున్నాం. ఈ పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు మూడు దశల్లో అందించడం జరుగుతుంది. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.12 వేల కోట్లు రూపాయలు ఖర్చు చేయబోతున్నది.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బోధనలే శిరోధార్యంగా భావించిన తెలంగాణ ప్రభుత్వం దళితులు స్వశక్తితో, స్వావలంబనతో జీవించాలన్న ఆశయంతో ‘దళితబంధు’ అనే విప్లవాత్మక పథకాన్ని అమలు చేస్తున్నది. చరిత్రలో మునుపెన్నడూలేనివిధంగా రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని నూరుశాతం గ్రాంట్గా అందిస్తున్నది. దీనిని లబ్ధిదారులు తిరిగి చెల్లించనవసరం లేదు. ఈ ధనంతో దళితులు తమకు నచ్చిన, ఇష్టం వచ్చిన ఉపాధిని ఎంచుకొని, ఆత్మగౌరవంతో జీవించడానికి ప్రభుత్వం అండదండగా నిలుస్తున్నది. దళిత బంధు పథకం కింద ప్రభుత్వం ఇప్పటివరకూ 50 వేల మంది లబ్ధిదారులకు రూ.5 వేల కోట్లు అందించింది. ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి రూ.17,700 కోట్లు కేటాయించుకున్నం. రెండో విడత లక్షా 30 వేల మందికి దళిత బంధు పథకం అందించుకుంటున్నం.
హుజూరాబాద్ నియోజకవర్గంలో నూటికి నూరు శాతం దళితబంధు పథకాన్ని అమలు పరిచాం. మిగిలిన 118 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గంలో 1100 మందికి ప్రస్తుతం అందిస్తున్నాం. దళితులు పారిశ్రామిక, వ్యాపార రంగాలలో మరింత ముందుకువచ్చి ప్రగతి సాధించాలన్నది నా ఆకాంక్ష. ఇందుకు అనుగుణంగా లాభసాటి వ్యాపారాలకు ప్రభుత్వం ఇచ్చే లైసెన్సులలో దళితులకు 15 శాతం రిజర్వేషన్లు కూడా అమలు చేస్తున్నది. ఫర్టిలైజర్ షాపుల కేటాయింపులో, హాస్పిటల్ హాస్టల్ కాంట్రాక్టుల కేటాయింపుల్లో, మెడికల్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అమలవుతున్నది. ఇటీవల రాష్ట్రంలో కేటాయించిన 2,616 వైన్ షాపుల్లో 261 దుకాణాలు దళితులకు కేటాయించింది. దళిత విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్ షిప్ కింద రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నది. దళితుల గృహావసరాలకోసం 101 యూనిట్ల వరకూ విద్యుత్ ను ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్నది.
షెడ్యూలు కులాలు, తెగల అభివృద్ధికి ప్రత్యేక ప్రగతినిధి చట్టాన్ని రాష్ట్రప్రభుత్వం అమలుపరుస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు ఉద్దేశించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించకుండా రక్షణ కల్పించింది. ఏదైనా ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు పూర్తిగా ఖర్చుగాని పక్షంలో ఈ చట్టంప్రకారం ఆ నిధులను తరువాతి సంవత్సరానికి కచ్చితంగా బదలాయింపు చేసేలా నిబంధనలు తీసుకొచ్చింది.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు.