వర్షం దంచి కొట్టింది. కాలం మొదలైనప్పటి నాటి నుంచి ముఖం చాటేసిన వాన జోరుగా పడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఎడతెరిపిలేకుండా పడగా, ఇన్నాళ్లూ చుక్కనీరు లేక ఎండిపోతున్న పంటలకు జీవం పోసినట్టయింది. వరణుడి ప్రతాపానికి వాగులు, వంకలు, చెరువులు, కుంటలకు జలకళ వస్తుండగా, ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతున్నది. ఎల్లంపల్లి బరాజ్, మధ్య మానేరుకు ఇన్ఫ్లో వస్తున్నది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

కరీంనగర్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి నిరాశపడ్డ రైతుకు మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వాన ఊరటనిచ్చింది. ఆశలు వదులుకున్న పత్తి, తదితర ఆరుతడి పంటలకు జీవం పోసినట్టయింది. వానకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇంత పెద్ద వర్షం మొదటి సారి కురిసింది. కరీంనగర్ జిల్లాలో సగటున 42.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, అత్యధికంగా గంగాధర మండలంలో 88.6 మిల్లీమీటర్లు పడింది. ఈ సీజన్లో 2.79 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేయగా, ఇప్పటి వరకు నీటి సదుపాయం ఉన్న చోట 1.49 లక్షల ఎకరాల వరకు వరి సాగు చేశారు.
48 వేల ఎకరాల్లో సాగుతుందని అంచనా వేసిన పత్తి ఇప్పటి వరకు 44 వేల ఎకరాల్లో వేశారు. ఇటు 3,880 ఎకరాల్లో మక్క సాగవగా, కంది, పెసర తదితర పంటలు కలిపి ఇప్పటి వరకు జిల్లాలో 1,99,392 ఎకరాల్లో మొత్తం పంటలు సాగు చేశారు. కాగా, ప్రస్తుతం పడిన వానతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ దయ చూపకున్నా ఆ వాన దేవుడు దయ చూపాడని చెబుతున్నారు. ఇటు వానలతో నగరం తడిసిముద్దయింది. బైపాస్ సమీపంలోని ఆటోనగర్లోని లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. దీంతో వాహనాలు మునిగిపోగా, రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన జడ రాజయ్య ఇంటి పైకప్పు కూలిపోయింది.
ఎల్లంపల్లికి వరద
అంతర్గాం, జూలై 29: ఎడతెరిపి లేని వర్షాలతో గోదావరి నిండుగా ప్రవహిస్తుండగా.. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద చేరుతున్నది. బుధవారం ఉదయానికి ప్రాజెక్టులోకి 75 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. అవుట్ఫ్లో 12,875 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టులో నీటిమట్టం 148 మీటర్లకు.. సాయంత్రానికి 144.22 మీటర్లకు చేరుకున్నది. నీటి నిల్వ 11.1105 టీఎంసీలుగా ఉన్నది.