Jharkhand : జార్ఖండ్లో పేపర్ లీకేజీ అంశం సంచలనం కలిగిస్తోంది. ఇటీవల జరిగిన జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీలపై రాష్ట్రంలో సీఐడీ విచారణ జరుగుతోంది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. 2024లోనూ పేపర్ లీకేజీ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. 2024లో జరిగిన జేఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) పేపర్ లీకైనట్లు సీఐడీ విచారణలో కీలక నిందితుడు అభయ్ తివారి అలియాస్ మనోజ్ కుమార్ తివారి చెప్పాడు. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పేపర్ లీకేజీ కేసులో అభయ్ తివారిని సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. అతడి విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయి.
తివారి వెల్లడించిన వివరాల ప్రకారం.. 2024లో జేఎస్ఎస్సీ-సీజీఎల్ పరీక్షా పత్రాల్ని కొందరు అభ్యర్థులకు విక్రయించారు. ఒక్కో అభ్యర్థి రూ.12 లక్షలు చెల్లించి, వారికి పరీక్షా పత్రాల వివరాలు అందించారు. అలా, మొత్తం 15 మంది అభ్యర్థుల నుంచి రూ.1.80 కోట్లు వసూలు చేశారు. అలాగే, 45 మంది అభ్యర్థులను బొకారోలోని ఒక ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అభ్యర్థులకు ప్రశ్నాపత్రంలోని 65 ప్రశ్నలు చెప్పారు. వాటికి జవాబులు గుర్తుంచుకునేలా శిక్షణ ఇచ్చారు. పరీక్షా పత్రాల ముద్రణను వెబెల్ సంస్థకు అప్పగించారు. నిందితుడు అభయ్ తివారి కూడా ఈ పరీక్షల్లో 48వ ర్యాంకు సాధించాడు. అతడితోపాటు సోదరుడు అక్షయ్ తివారి, భార్య సుష్మా కుమారి కూడా మంచి ర్యాంకులు సాధించి, ఉద్యోగాలు కూడా పొందారు. ఈ కేసుకు సంబంధించి జేపీఎస్సీ మాజీ ఛైర్మన్ ఎల్ ఖియాంగ్తేను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
అతడు గత నెలలోనే తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం అతడిని సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించాలంటూ జార్ఖండ్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇటీవల జరిగిన జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ పరీక్షల్ని రద్దు చేయాలని కూడా విద్యార్థులు కోరుతున్నారు. కానీ, వీటికి ప్రభుత్వం తలొగ్గడం లేదు. దీంతో విద్యార్థులకు, ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రభుత్వంపై విద్యార్థులు తిరుగుబాటు చేస్తున్నారు. సోమవారం విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి యత్నించగా, పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. అయినప్పటికీ విద్యార్థులు అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. మరోవైపు మంగళవారం కూడా రాంచీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.