TN Assembly : వైద్యవిద్యా కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ ప్రవేశ పరీక్ష (NEET Entrance Exam) ను తమిళనాడు (Tamil Nadu) తొలి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో సీఎం విజయ్ (CM Vijay) నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం (TVK Govt) రాష్ట్ర అసెంబ్లీలో నీట్కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఆరోగ్యశాఖ మంత్రి (Health Minister) కె అరుణ్రాజ్ (K Arun Raj) మంగళవారం ఈ తీర్మానాన్ని తీసుకువచ్చారు. దీనికి ప్రధాన విపక్షాలైన డీఎంకే (DMK), ఏఐఏడీఎంకే (AIADMK) మద్దతు తెలిపాయి. టీవీకేకు మిత్రపక్షాల నుంచి ఎలాగూ మద్దతు ఉన్నది. ఒక్క బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసింది.
ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సందర్భంగా ఆరోగ్య మంత్రి అరుణ్రాజ్ మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం నీట్ (NEET) ను రద్దు చేయాలి. ఈ ప్రవేశ పరీక్షవల్ల విద్యార్థుల దృష్టి కోచింగ్ సెంటర్ల వైపు మళ్లింది. ఫీజులు భారీగా వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లోని సామాజికంగా-ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి’ అని ఆందోళన వ్యక్తంచేశారు. సామాజిక న్యాయం, సమానత్వం, రాష్ట్రాల హక్కులకు ఈ పరీక్ష వ్యతిరేకం అనే విషయాన్ని తమిళనాడులోని ప్రతి ప్రభుత్వం వాదిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
12వ తరగతి మార్కుల ఆధారంగా వైద్య కోర్సుల్లో ప్రవేశం ఉండాలని విజయ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. గతంలో డీఎంకే ఇదే ప్రతిపాదన చేసింది. నీట్ పేపర్ లీక్ అంశాన్ని కూడా తమిళనాడు ప్రభుత్వం తీర్మానంలో ప్రస్తావించింది. విద్యార్థుల ఆత్మహత్యలకు ఈ పరీక్ష ఒత్తిడి కారణమని పేర్కొన్నది. నీట్ రద్దుతోనే వాటికి ముగింపు వస్తుందని అభిప్రాయపడింది.