Konda Surekha : మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కొండా సురేఖ వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు అందింది. వెంటనే బయలుదేరి రావాలని పార్టీ పెద్దల నుంచి ఆమెకు సందేశం అందినట్లు తెలుస్తున్నది. మంత్రివర్గం నుంచి తొలగించిగానే హైకమాండ్ రంగంలోకి దిగడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతున్నది.
నిన్న తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కొండా సురేఖతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని, అధిష్ఠానం అండగా ఉంటుందని ఆమెకు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సంభాషణ జరిగిన కొద్ది గంటల్లోనే ఢిల్లీ నుంచి పిలుపు రావడం గమనార్హం. మంత్రి పదవి కోల్పోయి అసంతృప్తితో ఉన్న కొండా సురేఖను బుజ్జగించేందుకే అధిష్ఠానం ఈ చర్యలు చేపట్టినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రమంలో కొండా సురేఖకు కేబినెట్ స్థాయి పదవిని అప్పగించే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అధిష్ఠానం పిలుపు మేరకు కొండా సురేఖ ఢిల్లీ పర్యటన తర్వాత ఈ వ్యవహారంపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.