KTR | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టబోయేది మూసీ బ్యూటిఫికేషన్ కాదు.. మూసీ లూటిఫికేషన్ అని ప్రజలకు అర్థమై పోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చెటమలు పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తన పాపం బయటపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ భవన్లో మూసీపై కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. నిన్న సీఎం రేవంత్ రెడ్డి దాదాపు రెండున్నర గంటల పాటు తాను ఏదో విజ్ఞాన ప్రదర్శన చేస్తున్నానని అనుకుని తన సంపూర్ణమైన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు. చేయని సర్వేలను చేసినట్టు.. అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలను అర్థంపర్థం లేని అసంబద్ద వాదనలను సంపూర్ణంగా బయపటెట్టి తన పరువు తానే తీసుకున్నారు అని కేటీఆర్ విమర్శించారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు. మా ఇంటికి ఎవరు రాలేదు.. సర్వే జరగలేదని ప్రజలే చెబుతున్నారు. ఈయనేమో రెండు నెలల నుంచి సర్వే చేస్తున్నామని అబద్ధాలు ఆడుతున్నారు. ఇక జేసీబీలతో, కూలీలను పెట్టి ఇండ్లు కూలగొడుతున్నారు. ఇందుకు సాక్ష్యంగా సోషల్ మీడియాలో కూడా వీడియోలు వచ్చాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఇండ్లను కూలగొట్టేందుకు వచ్చిన ఓ కూలీ కూడా బాధపడ్డట్టు సోషల్ మీడియాలో వీడియోలు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు.
రెండు గంటల పాటు ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదటుపెడితే లక్షన్నర అంచనా వ్యయం దాకా అన్ని అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి. ఆయన పాపం బయటపడుతుందని చెప్పి.. ఇది మూసీ బ్యూటీఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెటమలు పడుతున్నాయి. తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తున్న క్రమంలో గ్రాఫిక్స్ మాయాజాలంతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. లక్షన్నర కోట్ల కుంభణానికి కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు.. దాన్ని సమాజం గమనిస్తుంది. మీరు ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు. 420 హామీలతో ప్రజల గొంతు కోశారు. ముఖ్యమంత్రి మూసీ ప్రేమంతా.. ఢిల్లీకి పంపే మూటల కోసమే అని తేలిపోయింది. ఈ ప్రభుత్వం ఆలోచన ఎలా ఉందంటే.. నోట్ల రద్దు చేసినప్పుడు మోదీ చెప్పిన మాటల మాదిరిగా చోటే భాయ్ రేవంత్ మూసీపై రోజుకో మాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Group-1 Aspirants | అశోక్నగర్లో ఉద్రిక్తత.. గ్రూప్-1 అభ్యర్థులపై లాఠీ చార్జ్ చేసిన పోలీసులు