KTR | హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు చూపించిన చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 24 నియోజకవర్గాల్లో ఒక్క సీటు ఇతర పార్టీలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఇవాళ హైదరాబాద్ ప్రజల చైతన్యానికి శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కొందరు మోసపోయారు. కానీ హైదరాబాద్ వాళ్లు మాత్రం మోసపోలేదు. కాంగ్రెసోళ్ల మాటలు, వ్యవహారం తెలుసు కాబట్టి.. 24 నియోజకవర్గాల్లో మీ చైతన్యాన్ని చూపించారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తప పడే రోజు వస్తది. రాజకీయాల్లో హత్యలు ఉండవు.. ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు తప్ప మీరు తప్పు చేయలేదు. మీరంతా పార్టీని వెన్నంటే ఉన్నారు. పార్టీలో ఇవాళ కార్తీక్ రెడ్డి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు అని కేటీఆర్ పేర్కొన్నారు.
మీ అందరితో ప్రార్థన ఒక్కటే.. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే అరుదైన అవకాశం ఉంటుంది. ఆ అవకాశం కార్తీక్ రెడ్డికి వచ్చింది. ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే.. అంత మేలు జరుగుతుంది. కార్తీక్ రెడ్డి.. మూసీ ప్రాజెక్టు వల్ల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దాదాపు ఐదారు వందల కుటుంబాలను కలిశాం. హిందూ ముస్లిం అనే తేడా లేకుండా.. మాకు ఎవరు మేలు చేస్తారో ఎవరు చేయరో అర్థం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏండ్ల నుంచి ఇండ్లు కట్టుకున్నాం.. ఇప్పుడేమో కబ్జాదారులు అని అంటున్నారు. అన్ని ట్యాక్స్లు కడుతున్నాం. కట్టంగా కూడా ఇవాళ దొంగలు, ఆక్రమణదారులు అని బద్నాం చేస్తున్నారని వారు వాపోయారు. బంగారం లాంటి భూమిని విడిచిపెట్టి పోవాలని కాంగ్రెసోళ్లు బెదిరిస్తున్నారు. కోట్ల ఆస్తి మా పిల్లలకు ఉండిపోతది అనుకుంటే.. ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. బీఆర్ఎస్ అంటే ఒక సామాన్య శక్తి కాదు : కేటీఆర్
Fire Accident | మణికొండలోని అపార్టుమెంటులో భారీ అగ్నిప్రమాదం.. వీడియో