భోపాల్: మధ్యప్రదేశ్లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు. (Children Dead, Fall ill) దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మచ్ఛుర్దా, అడోరి, బొండరి, కోర్కా, కుండెకాస గ్రామాల పిల్లలు గత 40 రోజులుగా తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, ఫంగల్, చర్మ వ్యాధులు, గజ్జి, తట్టు, జ్వరం, జలుబు, దగ్గు, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బైగా ప్రజలు అధికంగా నివసించే ఈ గ్రామాలలో జూన్ 26 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది పిల్లలు మరణించారు. వందలాది మంది ఆసుపత్రిపాలయ్యారు.
కాగా, కుండెకాస గ్రామంలో పరిస్థితి అత్యంత తీవ్రంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి రోగులను పరీక్షించేందుకు ఇరవై సర్వే బృందాలు, 10 మంది వైద్య అధికారులతో పాటు నాలుగు అంబులెన్స్లను మోహరించారు. రక్తంతో పాటు నీటి నమూనాలు సేకరించి కోల్కతాలోని ఐసీఎంఆర్ సంస్థ, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో సహా దేశవ్యాప్తంగా ఉన్న అనేక అధునాతన పరీక్షా కేంద్రాలకు పంపారు. వాటి నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు ఆరోగ్య అధికారులు తెలిపారు.
మరోవైపు ఇప్పటి వరకు జరిపిన ఆరోగ్య సర్వేలో వివిధ అనారోగ్యాలతో బాధపడుతున్న వందలాది మంది పిల్లలను గుర్తించారు. 3 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న 98 మంది పిల్లలను బాలాఘాట్ జిల్లా ఆసుపత్రిలో చేర్చినట్లు వైద్యాధికారి తెలిపారు. వారిలో 51 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. మిగిలిన 47 మంది పిల్లలు వైద్యుల పర్యవేక్షణలో, నిరంతర చికిత్సలో ఉన్నట్లు వివరించారు. అయితే మెరుగైన వైద్య సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల గ్రామాల్లోని చిన్నారులు వ్యాధుల బారిన పడి చనిపోతున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపించారు.