Haryana : జర్మనీలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో రెండు రోజులక్రితం జరిగింది. మృతుడిని హరియాణా, కురుక్షేత్రలోని, మహదేవ్ మొహల్లాకు చెందిన విషు శర్మ (25)గా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విషు కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటున్నాడు. నవంబర్ 2022లో అతడు మొదల పోర్చుగల్ వెళ్లాడు. ఈ సమయంలో అతడి కోసం తండ్రి ప్లాట్ అమ్మి, రూ.20 లక్షలు అందించాడు.
విషు.. పోర్చుగల్లో ఏడాది పని చేసిన తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ ఆర్మీలో ఆరు నెలలపాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఫ్రెంచ్ ఆర్మీలో దాదాపు ఏడాదిపాటు పని చేశాడు. ఆ తర్వాత జర్మనీ వెళ్లాడు. అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో ఉంటూ, డెలివరీ సెక్టార్లో సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా అతడు అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో విషు శర్మ మరణించినట్లు అతడి తల్లిదండ్రులకు జర్మనీలోనే ఉంటున్న విషు స్నేహితుడు గౌరవ్ ఉదయం పోన్ చేసి చెప్పాడు. అతడిని ఎవరో పొడిచి చంపినట్లు వెల్లడించాడు. అయితే, ఎవరు చంపారు.. ఎందుకు చంపారు వంటి వివరాల్ని పోలీసులు కూడా చెప్పలేదని గౌరవ్.. విషు తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
వారు చివరగా గత సోమవారం విషుతో మాట్లాడినట్లు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే అతడు మరణించినట్లు తెలిసిందన్నారు. అయితే, అక్కడి పోలీసుల నుంచి హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదన్నారు. విషు ఎలా మరణించాడు.. ఎవరు, ఎందుకు హత్య చేశారో తమకు తెలియాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే సమయంలో అతడి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.