KTR | హైదరాబాద్ : గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకం లబ్దిదారులకు ఉన్నది ఉన్నట్టు ఇచ్చే ఉద్దేశం ఉంటే రైతుబంధుపై చర్చ ఎందుకు..? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ నిలదీశారు. రైతుభరోసాపై ప్రభుత్వం చేపట్టిన స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించి రూ. 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మేం ఒక దఫా మాత్రమే చెల్లించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చెప్పడం అభినందనీయం. రైతుబంధు రూ. 21,283 కోట్ల దుర్వినియోగం జరిగిందని మంత్రి తుమ్మల చెప్పారు. 2019-20లో సాగు విస్తీర్ణం 141 లక్షల ఎకరాలని మంత్రే చెప్పారు. 2020-21లో సాగు విస్తీర్ణం 204 లక్షల ఎకరాలు అని మీరు ఇచ్చిన నివేదికలో ఉంది. రైతుబంధు ఇవ్వడం వల్లే సాగు విస్తీర్ణం 2 కోట్ల ఎకరాలకు పెరిగింది. ఇక మంత్రి తుమ్మల ఆర్వోఎఫ్ఆర్ భూముల గురించి ప్రస్తావించారు. నాలుగున్నర లక్షల గిరిజన బిడ్డలకు పోడు పట్టాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల కింద ఉన్న భూముల్లో ఒక పంట మాత్రమే సాగు చేసే అవకాశం ఉంటుంది. మేజర్ కాల్వలు ఉండకపోవడం వల్ల చాలా కష్టంతో సాగు చేస్తారు. ఈ గిరిజన బిడ్డలకు రెండో విడుత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..? సమాధానం చెప్పాలి. ఇక పత్తి 45 లక్షల ఎకరాల్లో పండుతుంది. ఈ పంట కాలం 8 నెలలు. మరి పత్తి రైతుకు ఒకటే పంటకు ఇస్తారా..? రెండు పంటలకు ఇస్తారా..? అలాగే కంది పంట కాలం కూడా 8 నెలలు.. కాబట్టి కంది పంటకు ఒకటే సారి ఇస్తారా..? రెండు సార్లు ఇస్తారా..? లేదా అనేది చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
రైతుబంధుకు కోతలు పెట్టే ఆలోచన లేకపోతే పీఎం కిసాన్ గురించి మంత్రి తుమ్మల ఎందుకు ప్రస్తావించారు. పీఎం కిసాన్ మార్గదర్శకాలు మీకు మార్గదర్శకం అయితే.. 25 శాతం మంది రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తిస్తది. పీఎం కిసాన్ మార్గదర్శకాలు పాటించమని మంత్రి తుమ్మల చెబుతున్నారు. మరి ఉన్నది ఉన్నట్టు ఇచ్చేందుకు రైతుబంధుపై చర్చ ఎందుకు..? రైతుబంధుకు కోతలు పెట్టం అనుకుంటే ఎందుకీ చర్చ. కంది, పత్తి 8 నెలల పంట. పామాయిల్ పంటను విపరీతంగా ప్రోత్సహించాం. పామాయిల్ పంటకు, మామిడి తోటలకు రైతుభరోసా ఇస్తారా..? ఇవ్వరా..? రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో మూడు పంటలు సాగు చేసే వారు ఉన్నారు. మరి మూడు పంటలకు రైతుభరోసా ఇస్తారా..? ఇదే శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మూడో పంటకు ఎందుకు ఇవ్వరు అని మా ప్రభుత్వాన్ని నిలదీశారు. కాబట్టి మూడో పంటకు రైతుబంధు ఇస్తారా..? ఇవ్వరా..? అనే దానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | శాసనసభను ఇలా ఆలస్యంగా నడపడం కరెక్ట్ కాదు.. స్పీకర్కు హరీశ్రావు సూచన
SE Vijay Bhasker Reddy | ఇరిగేషన్లో పంచముఖుడు.. ముఖ్యమంత్రి ఆప్తమిత్రుడని అందలం!
Lagacharla | మళ్లీ రైతుల అరెస్టుకు ప్లాన్? తండాల్లో తాండవిస్తున్న భయానక వాతావరణం