Etala Rajender | హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సంబురాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మెజార్టీ ప్రజలు చెబుతున్నారని ఈటల తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో ఇచ్చిన హామీల చర్చపై రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నాను. నీ హామీల అమలుపై చర్చకు మోదీ ఎందుకు..? ఇక్కడ మేము ఉన్నాం. రేవంత్ ఎక్కడ చర్చకు రావాలో చెప్పు మేము సిద్దంగా ఉన్నాం. నీ ఆరు గ్యారంటీలే కాదు 420 హామీలపై చర్చిద్దాం అని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఫార్మా సిటీ రద్దు చేసి.. రైతులకు తిరిగి భూమి ఇస్తామని చెప్పారు. ఫోర్త్ సిటీ పేరుతో 14 వేల ఎకరాలకు తోడుగా మరో 16 వేలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అక్రమంగా రైతుల భూములు లాక్కోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కొడంగల్లో రైతులు భూమి ఇవ్వలేమని కాళ్ళు మొక్కినా బెదిరించి సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా కలెక్టర్ నాపై దాడి జరగలేదని చెప్పారు. లగచర్ల చుట్టూ పక్కల గ్రామాలకు మాత్రమే సమస్య కాదు..
ప్రతీ రైతు రేపటి రోజున మాకు సమస్య వస్తుందని భయపడుతున్నారని ఈటల రాజేందర్ తెలిపారు.
రైతులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. రైతులు నక్సలైట్లు కాదు.. వేరే వాళ్ళ భూములు అడగడం లేదు.. రేవంత్ రెడ్డిది మా కొడంగల్ కాకపోయినా గెలిపిస్తే మమల్ని హింసిస్తున్నారని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాం.. కానీ రేవంత్ రెడ్డిలా ప్రజలను ఇంతగా ఎవరు హింసించలేదు. మూసీ పక్కన ఉన్న భూములను లాక్కొని.. కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారు. ఒక వైపు హైడ్రా కూల్చివేతలు.. మరోవైపు లగచర్లలాంటి ఘటనలు జరుగుతుండగా ఇంకోవైపు ప్రభుత్వం సంబరాలు చేసుకోవడం సరికాదని ఈటల రాజేందర్ మండిపడ్డారు.
ఏ వర్గాన్ని వదలకుండా అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడు. నిరుద్యోగ భృతి ఏమైంది..? ఆర్టీసీ కార్మికులకు ఇస్తామని చెప్పిన రెండు పెండింగ్ పీఆర్సీలు ఎందుకు ఇవ్వడం లేదు..? కడుపు నొప్పి వస్తే టాబ్లెట్ దొరకదు.. కానీ కిరాణా కొట్టులో మాత్రం లిక్కర్ దొరుకుతుంది. హామీలు నెరవేర్చకుండా.. ఏ ముఖం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్లాలని కాంగ్రెస్ మంత్రులే అంటున్నారు. రేవంత్ రెడ్డి భూమి మీదకు వచ్చి మాట్లాడాలని రాజేందర్ విమర్శించారు.
ఇవి కూడా చదవండి..
Etala Rajender | లగచర్ల ఘటనపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన ఎంపీ ఈటల రాజేందర్
KTR | కొడంగల్ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా..? రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించిన కేటీఆర్
Harish Rao | ఇప్పటి వరకు కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం చేయకపోవడం శోచనీయం : హరీశ్రావు