Jharkhand : జార్ఖండ్లో ఇటీవల జరిగిన జేపీఎస్సీ పేపర్ లీకేజీని వ్యతిరేకిస్తూ అక్కడి విద్యార్థి సంఘాలు గత నెల 25 నుంచి ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. జార్ఖండ్ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతోపాటు మరో ఐదుగురు విద్యార్థులు రాజధాని రాంచీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇటీవల సీజేపీ నిరసన, సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్షను స్ఫూర్తిగా తీసుకుని వీరు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. ఈ దీక్షకు కూడా జార్ఖండ్కు చెందిన వేలాదిమంది విద్యార్థులు మద్దతు తెలుపుతున్నారు.
14వ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్సీ) పరీక్ష, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జేఎస్ఎస్సీ)తోపాటు రాష్ట్రంలో నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో అవకతవకలు, అక్రమాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి నేతలతో చర్చలకు సిద్ధమని ప్రకటించింది. ఈ అంశంపై బుధవారం ఉదయం జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ మాట్లాడారు. పేపర్ లీకులు రాష్ట్ర సమస్య కాదని, జాతీయ సమస్య అన్నారు. ఈ సమస్యపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. విద్యార్థి నాయకులతో చర్చించేందుకు తమ ప్రభుత్వ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.
పేపర్ లీకేజీలపై ఇప్పటికే విచారణ జరుపుతున్నామని, దర్యాప్తు సంస్థలు వేగంగా పని చేస్తున్నాయన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. చర్చలకు సంబంధించి ప్రభుత్వ ప్రతిపాదనపై విద్యార్థి నాయకులు కూడా స్పందించారు. తాము చర్చలకు సిద్ధమేనన్నారు. అయితే, ప్రభుత్వంతో జరిపే చర్చలను వీడియో తీయాలని వారు సూచించారు. గత ఏప్రిల్ 19న జరిగిన జేపీఎస్సీ పరీక్షను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.