దోమకొండ, ఏప్రిల్ 1: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. మండలంలో గురువారం పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. సంగమేశ్వర్ గ్రామంలో రూ.12 లక్షలతో నిర్మించిన 250 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోదామును, దోమకొండలో రూ.14.67లక్షలతో ఆధునిక హంగులతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. దోమకొండలోని పలు వార్డుల్లో రూ.85 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దోమకొండలో ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతున్నదని చెప్పారు. యువతకు పోటీ పరీక్షలకు ఉపయోగపడేవిధంగా గ్రంథాలయాల్లో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపారు. యువత కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని సూచించారు. గ్రంథాలయాల్లో నూతన హంగులతో వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా విప్ను స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ కోట సదానంద, మాజీ జడ్పీటీసీ మధుసూదన్రావు, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, జడ్పీటీసీ తిర్మల్గౌడ్, ఏఎంసీ చైర్మన్ కుంచాల శేఖర్, సర్పంచులు అంజలి, బురాని సమత స్వామిగౌడ్, ఉపసర్పంచ్ శ్రీకాంత్, ఎంపీటీసీలు రమేశ్, శారద, రాజేశ్వర్, దోర్నాల లక్ష్మి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
నందీగ్రామ్లో దీదీ ‘వీల్చైర్ పాదయాత్ర’
భారత్లో అక్టోబర్ తర్వాత భారీగా కరోనా కేసులు నమోదు..